పవన్ వెర్సస్ మహేష్.. ఈసారి ఎవరో?

టాలీవుడ్లో ఓ రసవత్తర బాక్సాఫీస్ సమరానికి చాలా ముందుగానే ముహూర్తం ఫిక్సయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్‌ను మోతెక్కించేసే క్లాష్ చూడబోతున్నాం. టాలీవుడ్ మెగాస్టార్ తర్వాతి తరంలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, బాక్సాఫీస్ స్టామినాతో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారులుగా నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల సినిమాలు ఒకే సీజన్లో విడుదల కాబోతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ సినిమా ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షెడ్యూల్ అయి ఉండగా.. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న చారిత్రక చిత్రం కూడా అదే పండక్కి ఖరారైంది. ఈ సినిమా 2022 సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఆ సంగతి అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు చిత్రాలకు డేట్లు ఇవ్వలేదు కానీ.. ఒకట్రెండు రోజుల గ్యాప్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటిదాకా పవన్, మహేష్ సినిమాలు ఒకేసారి విడుదలైన దాఖలాలు లేవు కానీ.. వారి మధ్య బాక్సాఫీస్ సమరాలు లేక మాత్రం కాదు. కొన్ని రోజుల విరామంలో వీరి సినిమాలు రిలీజయ్యాయి. ఇలా ఇప్పటిదాకా నాలుగుసార్లు జరిగింది. ఈ ఇద్దరు హీరోల మధ్య తొలి బాక్సాఫీస్ సమరం 1999లో జరిగింది. ఆ ఏడాది జులై 15న పవన్ సినిమా ‘తమ్ముడు’ రిలీజ్ కాగా.. రెండు వారాల అనంతరం 30న మహేష్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రాజకుమారుడు’ విడుదలైంది. రెండూ మంచి విజయాలే సాధించాయి. తర్వాతి ఏడాది వీరి మధ్య మరోసారి బాక్సాఫీస్ సమరం సాగింది. ఐతే ఈసారి రెండు సినిమాల మధ్య ఆరు రోజుల గ్యాపే వచ్చింది. మహేష్ రెండో చిత్రం ‘యువరాజు 2000 ఏప్రిల్ 14న విడుదలైతే.. పవన్ చిత్రం ‘బద్రి’ ఏప్రిల్ 20న విడుదలైంది. మహేష్ మూవీ యావరేజ్‌గా ఆడితే.. పవన్ సూపర్ హిట్ కొట్టి స్పష్టమైన పైచేయి సాధించాడు.

ఆపై 2004లో మహేష్ మూవీ ‘అర్జున్’ ఆగస్టు 20న వస్తే.. మూడు వారాల అనంతరం ‘గుడుంబా శంకర్’ సెప్టెంబరు 10న విడుదలైంది. ఈ రెండు చిత్రాల్లో ఏదీ సరిగా ఆడలేదు. ఐతే 2006లో మాత్రం మహేష్ సినిమా ధాటికి.. పవన్ చిత్రం అడ్రస్ లేకుండా పోయింది. ఏప్రిల్ 28న విడుదలైన ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్‌గాి నిలిస్తే.. మే 3న వచ్చిన ‘బంగారం’ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ పవన్, మహేష్ మధ్య బాక్సాఫీస్ సమరం ఇప్పుడే చూడబోతున్నాం. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ గ్యాప్‌లో డైరెక్ట్ క్లాష్‌కు రెడీ అవుతున్న ఈ సూపర్ స్టార్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.