మళ్ళీ అదే తప్పు చేసిన చంద్రబాబు

కుప్పం నియోజకవర్గంలో మొన్నటి పంచాయితి ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ చేసేసింది. కుప్పంలోని 89 పంచాయితిల్లో వైసీపీ 74 పంచాయితీలను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడొచ్చిన రిజల్ట్ గడచిన 35 ఏళ్ళ కుప్పం రాజకీయాల్లో ఎప్పుడూ జరగలేదు. అందుకనే పంచాయితీల ఫలితాలతో చంద్రబాబునాయుడు తలబొప్పి కట్టి వెంటనే కుప్పం పరుగెత్తుకు వెళ్ళారు.

అయితే కుప్పం వెళ్ళనైతే వెళ్ళారు కానీ గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేశారు. కాబట్టి చంద్రబాబులో వచ్చిన మార్పు కేవలం ప్రకటనల వరకే కానీ ఆచరణలో కాదని తేలిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే పంచాయితి ఎన్నికల్లో ఘోర పరాజయానికి మూల కారణమని పోటీలో ఓడిపోయిన వారు, కార్యకర్తలు ఎవరినైతే తప్పు పట్టారో వాళ్ళని చంద్రబాబు వెనకేసుకొచ్చారు.

నియోజకవర్గం ఇన్చార్జి పీఎస్ మునిరత్నం, ఎంఎల్సీ గౌనివారి శ్రీనివాసులు, తన పీఏ మనోహర్ పై మూడు రోజుల క్రితం కుప్పంలో ఓడిన అభ్యర్ధులు, కార్యకర్తలు మండిపోయారు. తమ ఓటమికి మీరే కారణమంటూ పై ముగ్గురిని పార్టీ జనాలు నోటికొచ్చినట్లు బూతులు తిట్టేశారు. తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటే అందరు వీల్లేదంటే వీల్లేదన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధులను గెలిపించి తర్వాత రాజీనామాలు చేయాలంటు అల్టిమేటమ్ జారీచేశారు.

దీన్నిబట్టే పై ముగ్గురిపై పార్టీ జనాలు ఎంత మంటగా ఉన్నారో అందరికీ అర్ధమైపోయింది. ఇలాంటి నేపధ్యంలో అందరి సమక్షంలో సమావేశం పెట్టిన చంద్రబాబు పై ముగ్గిరికి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఆశ్చర్యపోయారు. అధికారపార్టీ ప్రలోభాలకు ఎంఎల్సీ లొంగలేదట. మునిరత్నానికి పెద్ద తరహా రాజకీయాలట. మనోహర్ 35 ఏళ్ళు సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు క్లీన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. పై ముగ్గరు తప్పులు చేశారని మెజారిటి చెబుతున్నా చంద్రబాబు మాత్రం వారిని వెనకేసుకు రావటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

పంచాయితి ఎన్నికల్లో తమతో బలవంతంగా నామినేషన్లు వేయించిన తర్వాత తమ ఖర్మానికి తమను వదిలి పెట్టేయటంతోనే తాము ఓడిపోయినట్లు అందరు మండిపోతున్నారు. అంటే ఓడిన అభ్యర్ధులు, స్ధానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు నడుచుకుంటున్నారనేందుకు తాజా ఉదంతమే ఉదాహరణ. పై ముగ్గరికి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత రాబోయే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వాళ్ళతో కలిసి ఎంతమంది పనిచేస్తారో చూడాల్సిందే.