కేసీఆర్, జ‌గ‌న్‌.. ఒకటే టెన్ష‌న్‌..!!

అటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి, ఇటు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒక్క‌టే టెన్ష‌న్ ప్రారంభ‌మైందా? ఇద్ద‌రూ ఒకే విష‌యంపై ఆలోచ‌న సాగిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇదేదో నీళ్ల స‌మ‌స్యో.. మ‌రేమిటో కాదు.. ఇద్ద‌రికీ నేరుగా సంబంధించింది కాక‌పోయినా.. ఎవ‌రి రాష్ట్రాల్లో వారికి టెన్ష‌న్ గానే ఈ స‌మ‌స్య మారింది. విష‌యంలోకి వెళ్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఏపీలో తిర‌ప‌తి పార్ల‌మెంటు స్థానం, తెలంగాణ‌లో నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే..ఈ ఉప ఎన్నిక‌లు ఇరు రాష్ట్రాల‌ అధికార పార్టీలు టీఆర్ఎస్‌, వైసీపీల్లో కొత్త టెన్ష‌న్‌కు కార‌ణంగా మారాయి.

ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానంపై ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. ఇది వైసీపీకి సిట్టింగ్ సీట్‌. 2019లో విజ‌యం సాధించిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌.. అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్క‌డ ఉప పోరుకు రంగం రెడీ అవుతోంది. అయితే.. ఇది కేవ‌లం ఉప ఎన్నిక‌గానే కాకుండా.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు.. మూడు రాజ‌ధానులు.. వంటి కీల‌క అంశాల‌కు ముడిప‌డిన వ్య‌వ‌హారంగా మారింది. వాస్త‌వానికి ‌ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగుదశ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ మెజారిటీ పంచాయ‌తీలు సాధించింద‌ని చెబుతున్నా.. ఆశించిన విధంగా 90 శాతం ఏక‌గ్రీవాలు సాధించ‌లేక పోయింది.

ఇక‌, త్వ‌ర‌లోనే మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ ఓట‌రు నాడి కూడా వ్య‌తిరేకంగా ఉంద‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో తిరుపతి పార్ల‌మెంటు స్థానం ద‌క్కించుకోవడం అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర‌స్థాయిలో బెడిసికొట్టే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు దీంతో ఈ ఉప పోరు వైసీపీ లో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీస్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గనుంది. టీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన నోముల న‌ర‌సింహ‌య్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

అయితే.. ఈ ఉప ఎన్నిక‌ల కేసీఆర్‌లో టెన్ష‌న్ పెడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జ‌ర‌గ్గా అధికార పార్టీ సిట్టింగ్ సీటు కోల్పోయింది. అదేస‌మ‌యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌… మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నా.. ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌ప‌డ్డాయి. దీంతో కేసీఆర్ సాగ‌ర్‌లో గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సాగ‌ర్‌లో క‌నుక గెలుపు గుర్రం ఎక్క‌క పోతే.. కేసీఆర్‌కు వ్య‌తిరేకత ప్రారంభ‌మైంద‌నే భావించాల్సి ఉంటుంది. ఈ ప‌రిణామాల‌కు తోడు.. తాజాగా వ‌స్తున్న‌ ష‌ర్మిల పార్టీ ఆయ‌న‌కు మ‌రింత స‌వాలుగా మారనుంది. ఈ నేప‌థ్యంలో అటు ఏపీ, ఇటు తెలంగాణలో సీఎంల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.