సాయిపల్లవిని ఆపతరమా?


సాయిపల్లవి తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. కానీ వాటితో వచ్చిన పేరు మాత్రం అంతా ఇంతా కాదు. తెలుగులో నటించిన తొలి చిత్రం ‘ఫిదా’తోనే ఆమె పేరు మార్మోగిపోయింది. ఇక తర్వాత నటించిన ప్రతి సినిమాతోనూ తన ప్రతిష్టను పెంచుకుంటూ పోయింది. కేవలం ఆమెను చూడ్డానికి లక్షలాది మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటికే తెలుగులో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న సాయిపల్లవి.. ఈ ఏడాది మరింతగా విజృంభించేలా కనిపిస్తోంది. ఆమె నటిస్తున్న సినిమాలన్నీ రిలీజై అవి అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం ఆమె రేంజే మారిపోవచ్చు. మరే హీరోయిన్ అందుకోలేని స్థాయికి ఆమె చేరుకోవచ్చు. తెలుగులో సాయిపల్లవి ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూడింట్లోనూ తన పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉండేలా కనిపిస్తున్నాయి.

సాయిపల్లవి నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘విరాట పర్వం’ అత్యంత ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో హీరో రానా కంటే సాయిపల్లవి పాత్ర కీలకం అంటున్నారు. ఈ చిత్ర ప్రోమోల్లో సాయిపల్లవి కట్టిపడేస్తోంది. నక్సలిజం నేపథ్యంలో చాలా ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాలో సాయిపల్లవి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ పాత్రలో నటిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక తనకు ‘ఫిదా’ లాంటి మరపురాని చిత్రాన్నందించిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘లవ్ స్టోరి’లోనూ సాయిపల్లవి పాత్ర ప్రత్యేకంగా ఉండేలానే కనిపిస్తోంది. ‘ఫిదా’ మాదిరే ఇది కూడా సాయిపల్లవి కెరీర్లో ఒక మైలురాయిలా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా భిన్నంగా, కొత్తగా అనిపిస్తోంది. కోల్‌కతా నేపథ్యంలో కొన్ని దశాబ్దాల వెనుకటి కాలంలో నడిచే ఈ సినిమాలో సాయిపల్లవి మరో కొత్త అవతారంలో కనిపించబోతోంది. ప్రస్తుతం చేస్తున్న ఈ మూడు చిత్రాలు కాకుండా పవన్ సరసన ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లోనూ సాయిపల్లవి ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. తెలుగులో పెద్ద స్టార్ సరసన చేయబోతున్న తొలి చిత్రమిది. ఒరిజినల్ ప్రకారం చూస్తే ఈ పాత్ర కూడా సాయిపల్లవికి పేరు తెచ్చేదే. వరుసగా క్రేజీ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలతో సాయిపల్లవి ఈ ఏడాది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారేలా ఉంది.