పటేల్ పేరును ప్రభుత్వం ఎందుకు తీసేసిందబ్బా ?

గుజరాత్ లో ప్రారంభమైన అతిపెద్ద క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై పెద్ద రచ్చే మొదలైంది. ఇప్పటివరకు స్టేడియంకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుండేది. కాబట్టి క్రీడా ప్రేమికుల్లో పటేల్ స్టేడియంగానే పాపులరైంది. అయితే ఈమధ్యనే స్టేడియంను ఆధునీకరించారు. దాని సామర్ధ్యాన్ని పెంచటమే కాకుండా అనేక అధునాతన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దాంతో కొత్తగా ముస్తాబైన స్టేడియంను రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ప్రారంభించారు.

స్టేడియం ప్రారంభం తర్వాత అసలు విషయం బయటపడింది. రాష్ట్రపతి ప్రారంభించిన స్టేడియంకు పటేల్ స్ధానంలో నరేంద్రమోడి స్టేడియం అనే పేరు కనబడింది. అంటే ఇప్పటివరకు ఉన్న పటేల్ స్టేడియం కాస్త ఒక్కసారిగా నరేంద్రమోడి స్టేడియంగా మారిపోయిందన్నమాట. దాంతో పేరు మార్పుపై పెద్ద రచ్చే మొదలైంది.

ఇంతకాలం వల్లభాయ్ పటేల్ పేరు మీద తమకు మాత్రమే పేటెంట్ ఉన్నట్లు బీజేపీ, నరేంద్రమోడి చెప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు చెప్పుకోవటమే కాకుండా పటేల్ ను అవమానించిందంటు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగేవారు మోడి. అలాంటిది ఒక్కసారిగా పటేల్ స్ధానంలో మోడి పేరు కనబడగానే కాంగ్రెస్ గోల మొదలుపెట్టేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్టేడియంకు పటేల్ పేరును మార్చి మోడి పేరు పెడుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం కానీ కేంద్రప్రభుత్వం కానీ ఎక్కడా బయటకు తెలియనివ్వలేదు. రాష్ట్రపతి స్టేడియంను ప్రారంభించన తర్వాత మాత్రమే పేరు మార్పు విషయం బయపడింది. స్టేడియంకున్న పటేల్ పేరును తీసేసి మోడి పేరును పెట్టే విషయంలో ఇంత గోప్యత పాటించటమే వివాదానికి, అనుమానాలకు కారణమైంది.

అయితే ఈ వివాదంపై కేంద్రం ఇచ్చిన వివరణ కూడా కన్వీన్సింగ్ గా లేదు. స్టేడియంకు మాత్రమే మోడి పేరు పెట్టామని పెవిలియన్ కు, క్రీడా సముదాయానికి కాదని కేంద్రం చెప్పింది. అయితే స్టేడియంలో అంతర్భాగంగా ఉండే పెవిలియన్, క్రీడా సముదాయానికి ఎవరు పేరున్నా ఒకటే. ఎందుకంటే పేరుతోనే స్టేడియం పాపులరవుతుంది కాని లోపల సౌకర్యాలకు ఎవరు పేరు పెట్టిన ఒకటే.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం, ఉప్పల్ లోని రాజీవ్ స్టేడియం, తిరుపతిలోని ఎన్టీయార్ స్టేడియం, బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం, కోల్ కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియం అనే పాపులరయ్యాయి స్టేడియంలు. అంతే కానీ లోపల ఎవరి పేరున్నా ఎవరు పట్టించుకోరు. ఇంతచిన్న విషయం కేంద్రానికి తెలీకుండానే స్టేడియం పేరును మార్చేసిందా ?