షాక్: రోడ్డు పక్కన కాలిన గాయాలతో నగ్నంగా కాలేజీ విద్యార్థిని

దుర్మార్గమైన దారుణం చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఆమెకు ఎదురైన దారుణం గురించి వింటే ఒళ్లంతా జలదరించటం ఖాయం. బీఏ సెకండ్ ఇయర్ చదివే కాలేజీ విద్యార్థిని ఒకరు అరవై శాతం కాలిపోయి రోడ్డు పక్కన నగ్నంగా పడి ఉన్న వైనం షాకింగ్ గానూ.. సంచలనంగానూ మారింది. మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్టు ఆధ్వర్యంలో బాధితురాలు చదువుతుండటం గమనారహం.

యూపీలో చోటు చేసుకున్నఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ఎలాంటి వివరాల్ని వెల్లడించే స్థితిలో లేదని తెలుస్తోంది. సోమవారం ఉదయం తండ్రితో పాటు కాలేజీకి వెళ్లిన ఈ యువతి మళ్లీ తిరిగి రాలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రోడ్డు పక్కన సగానికి పైనే కాలిపోయి నగ్నంగా పడి ఉన్న ఆమె దుస్తులు.. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేకపోవటం పెద్ద మిస్టరీగా మారింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు కాలేజీ పూర్తి అవుతుందని.. ఆమె కోసం కాలేజీ బయటే ఎదురుచూసినట్లు బాధితురాలి తండ్రి చెబుతున్నారు. ఆమె రాకపోవటంతో ఆయన ఇంటికి వెళ్లారు. సాయంత్రం సుమారు ఆరు గంటల వేళలో లక్నో – బరేలీ నేషనల్ హైవే పక్కన కాలిపోయి.. నగ్నంగా పడి ఉందన్న విషయం తెలిసిందని వాపోతున్నారు.

పోలీసుల సాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఎందుకలా పడి ఉంది? కాలేజీకి వెళ్లిన ఆమె బయటకు ఎప్పుడు వచ్చారు? అసలేం జరిగిందన్న విషయాల మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఉదంతం పెను సంచలనంగా మారే అవకాశం ఉందంటున్నారు. మరి.. పోలీసులు ఈ ఉదంతం గురించి ఏం చెబుతారో చూడాలి.