సుకుమార్ పెద్ద బ్రాండ్ కాబోతున్నాడా?


పెద్ద దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి, మంచి స్క్రిప్టు రెడీ చేసుకుంటే దర్శకులుగా అవకాశాలు అందుకోవడం తేలికే. కానీ ప్రస్తుత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల దగ్గర పని చేసిన వాళ్లలో దర్శకులుగా నిలదొక్కుకున్న వాళ్లు తక్కువే. రాజమౌళి దేశంలోనే నంబర్ వన్ దర్శకుడి స్థాయికి ఎదిగాడు కానీ.. ఆయన శిష్యుల్లో దాదాపు ఎవరూ డైరెక్టర్లుగా స్థిరపడలేకపోయారు. పూరి జగన్నాథ్ శిష్యుల పరిస్థితీ అంతంతమాత్రమే. త్రివిక్రమ్ శిష్యులని చెప్పుకుని దర్శకులుగా మారినవాళ్లే చాలా తక్కువ. వెంకీ కుడుముల ఒక్కడు ఆయన త్రివిక్రమ్ శిష్యుడిగా బ్రాండ్ వేయించుకుని పరిశ్రమలోకి వచ్చాడు. రెండు హిట్లు కొట్టాడు.

సుకుమార్ శిష్యుల్లో సైతం ఇప్పటిదాకా విజయవంతం అయిన వాళ్లు తక్కువే. పల్నాటి సూర్యప్రతాప్ ‘కరెంట్’ లాంటి ఫ్లాప్ మూవీతో పరిచయం అయ్యాడు. ‘కుమారి 21 ఎఫ్’ హిట్టయినా క్రెడిట్ మొత్తం సుక్కు ఖాతాలోకి వెళ్లిపోయింది. హరిప్రసాద్ జక్కా ‘దర్శకుడు’, హుస్సేన్ షా కిరణ్ ‘మీకు మీరే మాకు మేమే’ సినిమాలతో నిరాశపరిచారు.

ఐతే ఇంతకుముందు తన శిష్యుల సినిమాలపై సరిగా దృష్టిపెట్టని సుక్కు.. ఈ మధ్య వాళ్లను నిలబెట్టే పనిలో సీరియస్‌గా దృష్టిసారించినట్లే ఉన్నాడు. వారి స్క్రిప్టులను పర్యవేక్షించడమే కాదు, పేరున్న నిర్మాతలతో సినిమాలు సెట్ చేస్తున్నాడు. అలాగే తాను కూడా వాటిలో నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు. తాజాగా సుక్కు ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో సుక్కుకు కూడా మంచి పేరొచ్చింది. దీని తర్వాత సుక్కు మరో శిష్యుడు సూర్యప్రతాప్ తీస్తున్న ‘18 పేజెస్’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అది సుక్కు కథతో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

మరోవైపు కార్తీక్ దండు అనే సుక్కు మరో శిష్యుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్టుకు పని చేసే అవకాశం అందుకున్నాడు. రమేష్ అనే మరో సుక్కు అసిస్టెంట్ ‘కప్పెల’ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా సుక్కు మరో ఇద్దరు శిష్యులు కూడా దర్శకులుగా మారతారని తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో టాలీవుడ్లో సుక్కు శిష్యుల హవా మామూలుగా ఉండదని, ఆయన మున్ముందు చాలా సినిమాలు నిర్మించబోతున్నారని.. ఒక బ్రాండ్ లాగా, వ్యవస్థ లాగా మారబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.