ఏబీఎన్ డిబేట్‌లో బీజేపీ నేత‌ను చెప్పుతో కొట్టిన కీల‌క నేత‌

వ‌ర్త‌మాన రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌పై ఏబీఎన్-ఆంధ్ర‌జ్యోతి న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో దారుణం చోటు చేసుకుం ది. బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్సీ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిని లైవ్‌లోనే చెప్పుతో కొట్టిన ఘ‌ట‌న రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తోం ది. తాజాగా లైవ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వ కేబినెట్ మీటింగ్ జ‌రిగింది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కారు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

ఈ నిర్ణ‌యాల్లో రాజ‌ధాని నిర్మాణాల‌ను కొన‌సాగించాల‌నేది కూడా ఒక‌టి. ఈ నేప‌థ్యంలో కేబినెట్ నిర్ణ‌యాల‌పై ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి మంగ‌ళ‌వారం రాత్రి 7.30 గంట‌ల‌కు డిబేట్ ప్రారంభించింది. ఈ డిబేట్‌కు బీజేపీ నేత‌.. విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి నేరుగా హైద‌రాబాద్‌లోని స్టూడియోకు వ‌చ్చారు. అదేస‌మ‌యంలో ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి.. అధ్య‌క్షుడు కొటిక‌లపూడి శ్రీనివాస్ త‌దిత‌రులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో రాజ‌ధాని నిర్మాణానికి బీజేపీ చేసింది ఏమీ లేద‌ని కొటిక‌ల పూడి విమ‌ర్శించారు. దీనికి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ఇరువురి మ‌ధ్య వాద‌న కొన‌సాగింది. నువ్వు టీడీపీ ఏజెంట్‌గా మాట్లాడుతున్నావు. ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని ఎత్తేసి.. పార్టీలో చేరిపో అంటూ.. విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కొటిక‌ల‌పూడి శ్రీనివాస్ సంయ‌మ‌నం కోల్పోయి.. కాలి చెప్పుతో ప‌క్క‌నే కూర్చున్న విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిని కొట్ట‌బోయారు. అయితే.. అంద‌క‌పోవ‌డంతో బ‌లంగా విసిరారు. ఈ క్ర‌మంలో కొంత త‌ప్పించుకున్నప్ప‌టికీ.. విష్ణ‌వ‌ర్ధ‌న్‌రెడ్డి కుడి భుజానికి చెప్పు బ‌లంగా త‌గిలి కింద‌ప‌డింది. దీంతో వెంట‌నే లైవ్‌ను క‌ట్ చేశారు.

ఇదిలావుంటే.. ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. డిబేట్ అంటే అన్ని విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తాయి. అలాంటి స‌మ‌యంలో సంయ‌మ‌నం కోల్పోయి.. మాట్లాడ‌డం.. భౌతిక దాడుల‌కు దిగ‌డం ఏంట‌ని నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌స్తుతం లైవ్ నిలిచిపోయింది. విష‌యం రాజ‌కీయంగా తీవ్ర రూపం దాల్చ‌డంతో ఏబీఎన్ ఎండీ ఆర్కే రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ ఘ‌ట‌న ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.