ఫ్యామిలీతో ఉప్పెన చూసిన బాల‌య్య‌

“నేను నా సినిమాలు.. నాన్న‌గారి సినిమాలు త‌ప్ప ఇంకేవీ చూడ‌ను” అని మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతూ ఉంటాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ మాట‌లు విని వేరే సినిమాలేవీ చూడ‌కుండా అప్ డేట్ కావ‌డం ఎలా.. కొత్త‌గా ప‌ని చేయాల‌నుకున్న ద‌ర్శ‌కుడి ప‌నితీరును అంచ‌నా వేయ‌డం ఎలా అన్న సందేహాలు క‌లుగుతుంటాయి జ‌నాల‌కు. ఐతే నిజంగా బాల‌య్య ఇలా ‘నా సినిమాలు-నాన్న‌గారి సినిమాలు’ అని ప‌రిధి గీసుకుని కూర్చుంటాడా అనేది అనుమాన‌మే.

ఇప్ప‌టిదాకా ఏం జ‌రిగిందో ఏమో కానీ.. బాల‌య్య టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ఉప్పెన సినిమా చూడ‌టం, ఆ విష‌యాన్ని బ‌హిరంగ ప‌ర‌చ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. బాల‌య్య కోసం మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లు ఉప్పెన సినిమా స్పెష‌ల్ స్క్రీనింగ్ వేశారు.

ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు త‌దిత‌రుల‌తో క‌లిసి బాల‌య్య ఆ సినిమా చూశాడు. త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చి బుచ్చిబాబుతో క‌లిసి ఫొటోల‌కు పోజు కూడా ఇచ్చాడు. బాల‌య్య ఉప్పెన సినిమా చూసిన విష‌యాన్ని మైత్రీ వాళ్లు ట్విట్ట‌ర్లో అధికారికంగానే ప్ర‌క‌టించారు. బాల‌య్య త‌న కుటుంబంతో క‌లిసి సినిమా చూసి ఉప్పెన కాస్ట్ అండ్ క్రూను అభినందించిన‌ట్లు వెల్ల‌డించ‌డం విశేషం. ప‌నిగ‌ట్టుకుని బాల‌య్యకు ఈ సినిమా ఎందుకు చూపించారు.. అడ‌గ్గానే ఆయ‌నెలా ఒప్పుకున్నాడు అని ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఈ సినిమా మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ అరంగేట్రం చిత్రం కావడంతో జనాల్లో మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. దీని వెనుక బ్యాగ్రౌండ్ ఏదైన‌ప్ప‌టికీ బాల‌య్య ఉప్పెన చిత్రం చూడ‌టం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన మాట వాస్త‌వం.