అజయ్ లేదా రణ్వీర్ అంటున్న ‘క్రాక్’ డైరెక్టర్

సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు యువ దర్శకుడు గోపీచంద్ మలినేని. అతను ఇంత పవర్ ఫుల్ సినిమా తీస్తాడని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే గోపీ నుంచి చివరగా వచ్చిన విన్నర్, పండగ చేస్కో సినిమాలు పరమ రొటీన్‌గా, ఏమాత్రం ఇంటెన్సిటీ లేకుండా సాగి ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. కెరీర్ ఆరంభం నుంచి మాస్ మసాలా సినిమాలకే పరిమితం అవుతూ వస్తున్న గోపీచంద్.. తనకున్న పరిమితుల్లో ఆ తరహా సినిమాలు తీయడంలోనూ పట్టు కోల్పోయేసరికి ఇక అతడికి భవిష్యత్ లేదనుకున్నారు.

ఐతే ‘క్రాక్’తో అతను బలంగా పుంజుకున్నాడు. ఫామ్‌లో లేని మాస్ రాజాను పెట్టి పవర్ ఫుల్ సినిమా తీసి తన సత్తా చాటాడు. దీంతో ఒక్కసారిగా అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ‘క్రాక్’ను హిందీలో తనే రీమేక్ చేసే అవకాశాలున్నట్లు చెప్పాడు.

బాలీవుడ్లోకి వెళ్లే అవకాశముందా అని అడిగితే.. తప్పకుండా అని చెబుతూ.. ‘క్రాక్’ను హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పాడు. మరి ఈ చిత్రానికి హీరో ఎవరనుకుంటున్నారు అని అడిగితే.. అజయ్ దేవగణ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని గోపీ అభిప్రాయపడ్డాడు. ఆయన కుదరకపోతే రణ్వీర్ సింగ్‌కు అయినా బాగుంటుందని.. వీళ్లిద్దరూ కాకుండా మరే హీరోతోనూ ఈ సినిమా చేయాలనుకోవట్లేదని గోపీ తెలిపాడు. శ్రుతి హాసన్ పాత్రలో ఎవరైనా పర్వాలేదని చెప్పాడు.

ఐతే తన తర్వాతి చిత్రం తెలుగులోనే ఉంటుందని, ఒక పెద్ద బేనర్లో ప్రముఖ కథానాయకుడితో సినిమాను అతి త్వరలోనే ప్రకటించబోతున్నానని తెలిపాడు. బహుశా ఇది బాలయ్య సినిమానే అయ్యుంటుందని భావిస్తున్నారు. రవితేజతో ‘క్రాక్’ సీక్వెల్ కూడా తప్పకుండా ఉంటుందని, అది మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో చేస్తానని గోపీచంద్ ప్రకటించాడు. ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచనుందా అని అడిగితే.. అలాంటి ఉద్దేశాలు లేవని, తనకు థియేటర్ల కోసం సినిమాలు తీయడమే ఇష్టమని గోపీచంద్ స్పష్టం చేశాడు.