మైత్రీ.. తమ్ముడి కంటే ముందు అన్నతో


మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్లో మరే సంస్థకూ సాధ్యం కాని రీతిలో క్రేజీ కాంబినేషన్లు సెట్ చేస్తూ, భారీ చిత్రాలను నిర్మిస్తూ దూసుకెళ్తున్న నిర్మాణ సంస్థ. ప్రస్తుతం మైత్రీ నిర్మిస్తున్న, నిర్మించబోయే సినిమాల సంఖ్య డజనుకు పైనే కావడం విశేషం. అందులో చాలా వరకు భారీ చిత్రాలే. తాజాగా ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయాన్నందుకున్న మైత్రీ.. ఈ తరహాలో కొన్ని మీడియం రేంజ్ బడ్జెట్లోనూ సినిమాలు సెట్ చేస్తోంది.

ఇందులో ఒకటి సోమవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు ఆ సంస్థ ఎంచుకున్న హీరో ఎవరో తెలిస్తే కొంచెం ఆశ్చర్యం కలగక మానదు. అతనెవరో కాదు.. నందమూరి కళ్యాణ్ రామ్. ఈ హీరోతో మైత్రీ సినిమా తీయబోతోందన్న సంకేతాలేవీ ఈ మధ్య వినిపించలేదు. అతను మలయాళ హిట్ ‘అంజామ్ పత్తిర’ రీమేక్‌లో నటిస్తాడని, ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారంతో సినిమా చేస్తాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడేమో చడీ చప్పుడు లేకుండా మైత్రీ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో సినిమాను మొదలుపెట్టాడు. ప్రారంభోత్సవ వేడుకకు గుబురు గడ్డంతో హాజరైన కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడు. ఇదే సినిమాలో లుక్కో ఏమో తెలియదు మరి. ఈ సినిమా గురించి ఇంకే వివరాలూ వెల్లడి కాలేదు. కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఇంతకుముందే ‘జనతా గ్యారేజ్’ బ్లాక్‌బస్టర్ తీసింది. అది వారికి రెండో సినిమా కావడం విశేషం.

తారక్‌తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా ఆ సంస్థ లైన్లో పెట్టింది. నందమూరి అభిమానుల దృష్టంతా దాని మీదే ఉండగా.. అంతకంటే ముందు తారక్ అన్నతో సినిమా ప్రకటించి ఆశ్చర్యపరిచింది మైత్రీ. ‘118’తో మళ్లీ ఫామ్ అందుకున్నట్లే కనిపించిన కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత ‘ఎంత మంచివాడవురా’ తిరిగి డిజాస్టర్ బాట పట్టాడు. లక్కీ బేనర్‌గా పేరున్న మైత్రీ అయినా అతడికి సరైన హిట్ ఇస్తుందేమో చూడాలి.