మళ్లీ మోహన్ లాల్‌ను అడుగుతున్న కొరటాల

తమిళం, హిందీ భాషల్లో పేరున్న సినిమాల్లో నటించిన మలయాళ లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ కొన్నేళ్ల కిందటి వరకు తెలుగులో మాత్రం నటించలేదు. ‘గాండీవం’లో ఒక పాటలో మెరిశాడు తప్పితే ఇక్కడ ఎలాంటి పాత్రనూ చేయలేదు. ఐతే ఆశ్చర్యకరంగా 2016లో ఆయన ఒకేసారి రెండు తెలుగు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి ఆశ్చర్యపరిచారు. అందులో ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించిన ‘మనమంతా’. ఇంకోటి కొరటాల శివ రూపొందించిన ‘జనతా గ్యారేజ్’.

‘మనమంతా’ మంచి సినిమానే అయినా కొన్ని కారణాల వల్ల సరిగా ఆడలేదు. కానీ ‘జనతా గ్యారేజ్’ మాత్రం బ్లాక్‌బస్టర్ అయింది. ఆ సినిమాకు లాల్ పెద్ద బలంగా నిలిచాడు. హీరో పాత్రను మించి అందులో లాల్ పాత్ర హైలైట్ కావడం విశేషం. లాల్‌ను మరిన్ని తెలుగు సినిమాల్లో చూడాలని మనవాళ్లు ఆశించారు కానీ.. ఆయన మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మోహన్ లాల్ మళ్లీ తెలుగులో ఓ భారీ చిత్రంలో నటించే అవకాశాలున్నట్లు సమాచారం.

‘జనతా గ్యారేజ్’తో లాల్‌కు తెలుగులో మంచి అనుభవాన్నిచ్చిన కొరటాల శివనే మరోసారి ఆయనతో ఇక్కడ సినిమా చేయించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రస్తుతం ‘ఆచార్య’ పనిలో బిజీగా ఉన్న కొరటాల.. దీని తర్వాత చేయాల్సిన అల్లు అర్జున్ సినిమా కోసం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. పొలిటికల్ టచ్ ఉన్న ఈ సోషల్ మూవీలో ముఖ్యమంత్రి పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను లాల్‌తో చేయించాలనే కొరటాల పట్టుదలతో ఉన్నాడట.

లాల్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని, ఈ సినిమాకు ఆయన అంగీకరించే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. కొరటాల మిత్రుడైన సుధాకర్ మిక్కిలినేని అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. 2022 ఆరంభంలో ఈ చిత్రం విడుదలవుతుందని అనౌన్స్‌మెంట్ టైంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ‘పుష్ప’ను పూర్తి చేసి ఈ సినిమా మీదికి రావాలని బన్నీ చూస్తున్నాడు.