ఇలా అయితే.. రాష్ట్రాన్నే అమ్మేస్తారా? పేలుతున్న స‌టైర్లు!!

ఏపీ ప్ర‌భుత్వంపై ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై.. విస్మ‌యం వ్య‌క్తం అవుతోంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇచ్చిన హామీలను అమ‌లు చేసేందుకు ఇప్ప‌టికే లెక్క‌కు మించి అప్పులు చేశారు. న‌వ‌ర‌త్నాల హామీల‌ను నెర‌వేర్చేందుకు ఎక్క‌డా లేని ప్ర‌యాస ప‌డుతున్నారు. అదేస‌మ‌యంలో ఎవ‌రు అప్పు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం.. అప్పు ఇచ్చేందుకు మేం గేట్లు ఎత్తుతాం.. మీరు మేం చెప్పిన‌ట్టు ఆడండి.. ప్ర‌జ‌ల న‌డ్డి విర‌చండి! అన్న ఆదేశాల‌ను సైతం జ‌గ‌న్ స‌ర్కారు తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించింది. ఈక్ర‌మంలోనే వివిధ రంగాల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చింది.

ప్ర‌ధానంగా వ‌చ్చే ఏప్రిల్ 1(త‌దుప‌రి ఆర్థిక సంవ‌త్స‌రం) నుంచి పట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఇంటి ప‌న్నులు, వాట‌ర్ చార్జీలు 30 శాతం మేర‌కు పెర‌గ‌నున్నాయి. ఇక, మ‌రో కీల‌క సంస్క‌ర‌ణ‌.. బియ్యం కార్డులను సాధ్య‌మైన‌న్ని త‌గ్గించ‌డం.. దీనికి కూడా జ‌గ‌న్ స‌ర్కారు ఓకే చెప్పేసి అమ‌లు చేసేస్తోంది. ఇవ‌న్నీ చేసి.. ఇటీవ‌లే కేంద్రం సాయంతో అప్పుల ప‌రిమితిని పెంచుకుంది. ఇక‌, ఇవ‌న్నీ చాల‌నట్టు.. విదేశీ రుణాల‌ను కూడా తీసుకున్న‌ట్టు ఇటీవ‌ల రాజ్య‌స‌భలో ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి వెల్ల‌డించారు. క‌ట్ చేస్తే.. పోనీ… ఇన్ని అప్పులు తీసుకున్నారు క‌దా.. ఇక‌నైనా ఆగుతారులే అనుకున్నారు ఆశావ‌హులు. కానీ, ఏపీ స‌ర్కారు దూకుడు మామూలుగా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా.. రాష్ట్ర వ‌న‌రుల‌ను సైతం అమ్మ‌కానికి పెట్టాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ముఖ్యంగా కోట్ల రూపాయ‌ల విలువైన ఎర్ర చంద‌నాన్ని అత్యంత వేగంగా విక్ర‌యించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. నిజానికి మ‌న ద‌గ్గ‌ర ల‌భించే ఎర్ర‌చంద‌నం ఎక్క‌డా లేదు. అయితే.. దీనికి సంబంధించి ఇత‌ర దేశాల వారు గ‌తంలోనే వ‌చ్చి చూసుకున్నారు. కొన్ని నిబంధ‌న‌ల నేప‌థ్యంలో కేంద్రం నుంచి అనుమ‌తులు రానందున అవి నిలిచిపోయాయి. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ వాటిని ఎంత‌కైనా తెగ‌న‌మ్మాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

అస‌లు అనుమ‌తులే రాని స‌రుకును ఎలా అమ్మాల‌ని అనుకుంటున్నారా.. ఇక్క‌డే ఉంది తిర‌కాసు అంటున్నారు. గ్రేడ్ 1 ప‌రిధిలోకి వ‌చ్చే ఎర్ర‌చంద‌నాన్ని గ్రేడ్ 3గా చూపిస్తే.. కేంద్రం అనుమ‌తి ఇస్తుందట‌! దీంతో దీనిని విక్ర‌యించి.. నిధులు తేవాల‌ని అధికారుల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ఈ నిధుల‌తోనే న‌వ‌ర‌త్నాలు అమ‌లు చేస్తార‌ట‌. దీంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు స‌టైర్లు వేస్తున్నారు. కుదిరితే..రాష్ట్రాన్ని కూడా అమ్మేసేలా ఉన్నాడే! అంటూ.. కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.