కేంద్రం దెబ్బకు అడ్రస్ లేని బీజేపీ నేతలు

కేంద్రప్రభుత్వం దెబ్బకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. కేంద్రం నిర్ణయాలను సమర్ధించలేక అలాగని వ్యతిరేకించి రోడ్లపైకి రాలేక నానా అవస్తలు పడుతున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏదైనా రాష్ట్రంలో ఉపయోగం ఉంటుందని అనుకుంటేనే నిధులు ఇస్తోంది, ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఏపి విషయంలో జరుగుతున్నదిదే.

తాజాగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయం కూడా ఇందులో భాగమే. నష్టాల్లో ఉందన్న కారణంతో ఫ్యాక్టరీలోని కేంద్రప్రభుత్వ వాటాను ఉపసంహరించుకుని ఆ మేరకు ప్రైవేటు కంపెనీలకు అమ్మేయాలని డిసైడ్ చేసింది. విషయం తెలిసిన వెంటనే ఉద్యోగులు, కార్మికసంఘాలు భగ్గుమంటున్నాయి. వీళ్ళకు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు మద్దుతుగా శుక్రవారం ఉదయం నుండి రోడ్లపైకి వచ్చేశాయి. ఇక ఒకటి రెండు రోజుల్లో మామూలు జనాలు కూడా రోడ్లపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఈ విషయం ఇలాగుండగానే విశాఖ రైల్వేజోన్ విషయమై కేంద్రమంత్రి మాట్లాడుతూ విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమన్నారు. నిజానికి విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయటం కేంద్రానికి ఏమాత్రం ఇష్టంలేదు. అసలు విశాఖ రైల్లేజోన్ ఏర్పాటన్నది రాష్ట్ర విభజన చట్టంలోని హామీ. కానీ యూపీఏ హయాంలో ఇచ్చిన హామీలను ఎన్డీఏ అమలు చేయకుండా తూట్లు పొడుస్తోంది. మోడి ఎందుకిలా చేస్తున్నారంటే ఏపికి ఎన్ని నిధులిచ్చినా, ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్యేజోన్ ఇచ్చినా రాజకీయంగా ఏ విధంగాను ఉపయోగం ఉండదని అర్ధమైపోయింది.

మొన్నటి బడ్జెట్లో కేరళ, చెన్నై, బెంగుళూరు మెట్రో ప్రాజెక్టులకు వేలాది కోట్లు కేటాయించారు. ఎందుకంటే తమిళనాడు, కేరళలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని. రేపటి ఎన్నికల ప్రచారంలో పై రాష్ట్రాలపై తమకు ఎంత ప్రేమ ఉందో చెప్పుకోవటానికి మాత్రమే నిధులు కేటాయించారు. ఒకవేళ ఆ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా రాకపోతే బహుశా కేటాయింపులను నిలిపేసినా ఆశ్చర్యంలేదు. ఇక బెంగుళూరు మెట్రోకు నిధులు ఎందుకిచ్చారంటే అక్కడ పాలనలో ఉన్నది తమ పార్టీనే కాబట్టి.

మొత్తానికి ఏపి విషయంలో కేంద్రం చూపుతున్న సవతితల్లి ప్రేమను తప్పు పట్టలేక, అలాగని బహిరంగంగా ఎదిరించలేక బీజేపీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి కమలనాదులు ఎక్కడా మీడియాలో కనబడటం లేదు. ఆ సమస్యను ఎలా అధిగమించాలా అని అవస్తలు పడుతుంటే తాజాగా విశాఖ స్టీల్స్ ప్రైవేటుపరం, విశాఖ రైల్వేజోన్ ఎప్పుడుస్తుందో తెలీదని చెప్పటం మూలిగే నక్కపై తాటిపండు పడటమే. బీజేపీ నేతలే అడ్రస్ లేకుండా తిరుగుతుంటే ఇక మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆలోచించటం వేస్టే.