వీర్రాజు సరికొత్త నినాదం..వర్కవుటవుతుందా ?

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజకీయంగా సరికొత్త నినాదాన్ని అందుకున్నారా ? తాజాగా ఆయన మాటలు వింటే ఇదే అనుమానం పెరుగిపోతోంది. జనాభా అత్యధికంగా ఉన్న బీసీలకే రాజ్యాధికారం అంటు వీర్రాజు చేసిన ప్రకటనే విచిత్రంగా ఉంది. ఎందుకంటే కాపు నేత అయిన వీర్రాజు బీసీలకే ముఖ్యమంత్రి పదవి అనే నినాదాన్ని ఎత్తుకోవటంటే అనుమానం రావటంలో వింతేముంది. కాకపోతే బీసీ నేతనే బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తుందని వీర్రాజు చేసిన ప్రకటన వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉందన్న విషయం తెలిసిపోతోంది.

సమాజంలో అత్యధిక జనాభా కలిగిన సామాజికవర్గాలు రెండే రెండు. అందులో మొదటిది బీసీలు రెండోది కాపులు. అయితే చాలా జిల్లాల్లో బీసీలకు కాపులకు రాజకీయాల్లో ఏమాత్రం పడదు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో బీసీలకు కాపులకు మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. వీర్రాజు కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతే. మరి ఈ విషయం తెలిసీ తాను స్వయంగా కాపు సామాజికవర్గం అయ్యుండి కూడా బీసీలకే ముఖ్యమంత్రి పదవని ఎందుకు మొదలుపెట్టినట్లు ?

ఎందుకంటే బీజేపీ వైపు బీసీలను లాక్కోవటానికే తప్ప మరోటికాదు. మొదటినుండి బీసీల్లో అత్యధికులు టీడీపీ వైపున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీసీల్లో చీలికవచ్చి వైసీపీవైపు మొగ్గుచూపించారు. అంటే బీసీల్లో అత్యధికులు ఉంటే వైసీపీ వైపు లేకపోతే టీడీపీ వైపున్నారని తేలిపోతోంది. అందుకనే బలమైన సామాజికవర్గమైన బీసీల మద్దతు లేకుండా బీజేపీకి నాలుగు సీట్లు కూడా రాదని వీర్రాజుకు తెలుసు. అందుకనే బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రిగా బీసీనే ప్రకటిస్తుందని చెప్పింది.

బీజేపీ తరపున బీసీ నేతే ముఖ్యమంత్రి అవుతారని చెప్పటం వరకు ఓకేనే కానీ టీడీపీ, వైసీపీలు కూడా బీసీలనే సీఎంలను చేస్తుందని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది. ప్రాంతీయ పార్టీలన్నవి ప్రైవేటు లిమిటెడ్ లాంటివి. వాటికి అధినేతలుగా ఎవరుంటే వాళ్ళే ముఖ్యమంత్రులవుతారని వీర్రాజుకు అంతమాత్రం తెలీదా ? తెలిసీ చాలెంజ్ చేస్తున్నారంటే బీసీలను పై రెండు పార్టీలకు వ్యతిరేకం చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎలాగూ బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టే వీర్రాజు నోటికొచ్చిన ప్రకటన చేశారనే ఆరోపణ కూడా మొదలైపోయింది. మహాఅయితే రాబోయే ఎన్నికలనాటికి బీజేపీ తరపున ఎక్కడైనా గట్టి నేతలు పోటీ చేస్తే అదే భాగ్యమన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కమలంపార్టీ తరపున పోటీ చేసిన అత్యధికులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్న విషయం గ్రహించాలి. చూద్దాం వీర్రాజు కొత్త రాజకీయ నినాదం ఏ మేరకు వర్కవుటవుతుందో.