ప్రభాస్ 50-50 ప్లాన్

ప్రభాస్‌తో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు చిత్రీకరణ జరుపుకుని చాలా ఆలస్యంగా రిలీజవుతాయనే పేరు పడిపోయింది. ‘బాహుబలి’తో అతడి సినిమాల మేకింగ్ స్థాయి పెరిగిపోవడం, వివిధ భాషల్లో సినిమాలను రిలీజ్ చేయాల్సి రావడం అందుకు ముఖ్య కారణం. ‘బాహుబలి’ తర్వాత చేసిన ‘సాహో’ ఎంత ఆలస్యమైందో తెలిసిందే. అది భారీ యాక్షన్ మూవీ కాబట్టి లేటైందేమో అనుకుంటే.. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ అలాగే జరుగుతోంది.

దీని తర్వాత ప్రభాస్ చేయనున్నవి కూడా భారీ చిత్రాలే కావడంతో సుదీర్ఘ నిరీక్షణ తప్పదనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇలా ప్రతి సినిమాకూ ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటే కష్టం అని భావించి ప్రభాస్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. ‘సలార్’తో పాటు ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కొన్ని రోజుల వ్యవధిలో సెట్స్ మీదికి తీసుకెళ్లిన అతను.. సమాంతరంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణలో పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ ఏడాదే ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేయాలనే ఆలోచనతో అతనున్నట్లు తెలుస్తోంది.

నెలలో 15 రోజులు ‘సలార్’కు, 15 రోజులు ‘ఆదిపురుష్’కు కేటాయించేలా షెడ్యూల్ వేసుకున్నాడట ప్రభాస్. ‘సలార్’ చిత్రీకరణ ఎక్కువగా తెలంగాణలోనే జరగనుంది. ‘ఆదిపురుష్’ అంతా ముంబయిలోనే ప్లాన్ చేశారు. ఒకేసారి రెండు సినిమాల్లో చేస్తూ లుక్ పరంగా వైవిధ్యం చూపించడం కొంచెం కష్టమే.

ఐతే ‘ఆదిపురుష్’ పురాణ గాథ కావడం ప్రభాస్‌కు కలిసొచ్చే విషయం. రాముడి పాత్రను మేకప్‌తో మేనేజ్ చేయొచ్చు. ఈ పాత్రకు విగ్గు అనివార్యం. ఇంకాస్త మేకప్ టచ్ ఇస్తే సరిపోతుంది. కాస్ట్యూమ్స్‌తోనూ చాలా వరకు కవర్ చేయొచ్చు. బాడీ పరంగా తేడా ఏమీ అవసరం లేదు. ‘సలార్’కు వచ్చేసరికి మోడర్న్ లుక్‌లోకి మారిపోతాడు. కాబట్టి రెండు సినిమాల చిత్రీకరణలో సమాంతరంగా పాల్గొనడం కష్టమేమీ కాదు. కాకపోతే నటన పరంగా వైవిధ్యం చూపించాల్సి ఉంటుంది. అది ప్రభాస్‌కు సవాలే. ఆ విషయంలో అతను ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. ‘సలార్’ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయొచ్చని అంటుండగా.. ‘ఆదిపురుష్’ ఆ ఏడాది ఆగస్టు 11కు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.