మళ్లీ దర్శకుడిని మార్చేసిన రాజశేఖర్?

పూర్తిగా పతనం అయిపోయిన కెరీర్‌ను మూడేళ్ల కిందట ‘గరుడవేగ’ సినిమాతో కొంచెం పైకి లేపగలిగాడు రాజశేఖర్. ఈ సీనియర్ హీరో సినిమా చూడ్డానికి మళ్లీ జనాలు థియేటర్లకు కదిలింది ఆ సినిమాతోనే. ఆ సినిమా ఏమీ పెద్ద సక్సెస్ కాకపోయినా.. తర్వాతి రాజశేఖర్ సినిమాకు హైప్ తీసుకురాగలిగింది. ‘కల్కి’కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే ‘గరుడవేగ’ పుణ్యమే. కానీ ‘కల్కి’ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.

ఈ సినిమా తర్వాత రాజశేఖర్ మళ్లీ తిరోగమన బాటలోకి వెళ్లిపోయాడు. కల్కి విడుదలై ఏడాదిన్నర దాటుతున్నా ఇప్పటిదాకా తన కొత్త సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. ఆ సినిమా తర్వాత ‘కపటదారి’ తెలుగు రీమేక్‌లో నటించడానికి సిద్ధమై, మూవీ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చాక వెనక్కి తగ్గాడు రాజశేఖర్. తర్వాత ఈ సినిమాలో సుమంత్ నటించడం తెలిసిన సంగతే.

మధ్యలో రాజశేఖర్ అహనా పెళ్లంట, పూల రంగడు, భాయ్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరితో ఓ సినిమాను మొదలుపెడుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. షూటింగ్ కూడా మొదలుపెట్టేస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. ఆ తర్వాత చివరగా రాజశేఖర్ కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోయే దర్శకుడిగా నీలకంఠ పేరు తెరపైకి వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి మలయాళ థ్రిల్లర్ ‘జోసెఫ్’ను తెలుగులో తీయబోతున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలొచ్చాయి. ఐతే అంతలో రాజశేఖర్ కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. దాన్నుంచి కోలుకుని మళ్లీ ఫిట్నెస్ అందుకున్న ఈ హీరో.. త్వరలోనే తన కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నాడట.

ఐతే ఆయన చేయబోయేది ‘జోసెఫ్’ రీమేకే అంటున్నారు కానీ.. దర్శకుడు మాత్రం నీలకంఠ కాదన్నది తాజా సమాచారం. లలిత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి ఇంతలో నీలకంఠ పేరు ఎందుకు పక్కకు వెళ్లింది.. కొత్త దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది అర్థం కావడం లేదు. బహుశా నీలకంఠతో రాజశేఖర్ వేరే సినిమా ఏమైనా చేయబోతున్నాడేమో అనుకుంటున్నారు సినీ జనాలు.