శంక‌ర్‌ను వ‌ద‌ల‌ని రోబో వివాదం

త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ను ఎప్ప‌ట్నుంచో వెంటాడుతున్న ఓ వివాదం ఇప్పుడు అత‌డిని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టింది. అత‌డికి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసే ప‌రిస్థితి త‌లెత్తింది. ప‌దేళ్ల కింద‌ట విడుద‌లైన శంక‌ర్ మాస్ట‌ర్ పీస్ రోబోకు సంబంధించిన వివాదంలో అత‌నిప్పుడు చిక్కుల్లో ప‌డ్డాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో శంక‌ర్ రూపొందించిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ రోబో 2010లో విడులై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. శంక‌ర్, ర‌జినీ కెరీర్ల‌లో ఇది బిగ్టెస్ట్ హిట్‌గా నిలిచింది. సౌత్ సినిమా స్థాయిని ఎంతో పెంచిన చిత్ర‌మిది. ఐతే రోబో కథ త‌న‌దే అంటూ అరుర్‌‌ తమిళ్‌ నందన్‌ అనే ర‌చ‌యిత సినిమా రిలీజైన కొత్త‌లో శంకర్‌పై కేసు వేశాడు. తాను రాసిన జిగుబా అనే కథను కాపీ చేసి దర్శకుడు శంకర్‌ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని అరుల్ ఆరోపించాడు.

1996లో అరుర్‌ రాసిన ఈ కథ ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఆ తర్వాత 2007లో దీనిని ఓ నవలగా కూడా ముద్రించారు. అరుర్ కేసు ఎన్నో ఏళ్లుగా కోర్టులో నానుతోంది. ఐతే ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ శంకర్ అస్స‌లు స్పందించలేదు. దీంతో ఆగ్ర‌హించిన కోర్టు శంక‌ర్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.

శంక‌ర్ ముందే స్పందించి ఉంటే, లేదా ర‌చ‌యిత‌తో రాజీ కుదుర్చుకుని ఉంటే ఎప్పుడో వివాదం స‌మ‌సిపోయేది. కానీ అత‌ను ఈ కేసును ప‌ట్టించుకోక‌పోవ‌డంతో సినిమా రిలీజైన ప‌దేళ్ల త‌ర్వాత కాపీ వివాదం కేసులో నాన్ బెయిల‌బుల్ వారెంట్ అందుకోవాల్సి వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు శంక‌ర్ ఏం చేస్తాడో, ఆరోప‌ణ‌ల‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి.