ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఎపిక్ క్లాష్?

టాలీవుడ్లో రిలీజ్ డేట్ల జాతర కొనసాగుతోంది. గురువారం ఏకంగా ఐదు కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించగా.. శుక్రవారం ఇంకో మూడు చిత్రాలకు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు. అందులో ‘సర్కారు వారి పాట’ లాంటి భారీ చిత్రం కూడా ఉండటం విశేషం. కొన్ని రోజుల కిందటే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. దుబాయ్‌లో 25 రోజుల తొలి షెడ్యూల్ మొదలుపెట్టారు.

ఈ మధ్య టాలీవుడ్లో శరవేగంగా సినిమాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ కూడా నాలుగైదు నెలల్లో అయిపోతుందని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల ఉంటుదని అనుకున్నారు. కానీ పరశురామ్ కొంచెం ఎక్కువ సమయం తీసుకోబోతున్నాడని స్పష్టమైంది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ఖాయం చేశారు. సంక్రాంతికి మహేష్ నుంచి ‘ఒక్కడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బిజినెస్ మ్యాన్’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మరపురాని సినిమాలు వచ్చాయి.

ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరోసారి తన చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలబెట్టాలని నిర్ణయించాడు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఖరారు చేసుకున్న తొలి సినిమా ఇదే. ఐతే ఆ పండక్కి ఇంకో రెండు భారీ చిత్రాలు రావచ్చనే అంచనాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారమే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తారని ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి.

ఈ మేరకు ప్రకటన కూడా వస్తుందని అంటుండగా.. మహేష్ కర్చీఫ్ వేసేశాడు. అయినా సరే ప్రభాస్ సినిమా వెనక్కి తగ్గదంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది మేలో మొదలుపెడతాడని, దాన్ని కూడా సంక్రాంతికే అనుకుంటున్నారని ఓ ప్రచారం నడుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్‌ల మధ్య ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్‌ను 2022 సంక్రాంతికి చూడబోతున్నామన్నమాట.