‘ఆంధ్రుల హ‌క్కు’ను కాపాడుకోలేమా?

‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కు’-నినాదం 1960ల ద‌శంలో భారీగా వినిపించింది. కేంద్రం ప్ర‌భుత్వం నిర్వ ‌హణ‌ లో ఏర్పాటైన ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌త్యేక చ‌రిత్ర ఉంది. అప్ప‌ట్లో ఈ ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం.. యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏక‌తాటి పై నిలిచింది. దీనిని సాధించేందుకు అనేక ఉద్య‌మాలు సాగాయి. ఈ క్ర‌మంలోనే 1970, ఏప్రిల్ 17న విశాఖలోనే ఉక్కు క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్టు అప్ప‌టి ప్ర‌ధాని ఇంద‌ర‌మ్మ ప్ర‌క ‌టించారు. న‌వ‌ర‌త్నాల్లో ఒక‌టిగా పేరున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని త‌ర్వాత ప‌రిణామాల క్ర‌మంలో సంస్క‌ర‌ణ‌ల పేరుతో ప్రైవేటుకు ధారాద‌త్తం చేసే క్ర‌తువు ప్రారంభ‌మైంది. ముఖ్యంగా పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధాని అయిన త‌ర్వాత‌.. ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యాన్ని త‌గ్గిస్తూ వ‌చ్చారు.

ఉద్దేశ‌పూర్వ‌క ఉదాసీన‌త

ఇక‌, ఇప్పుడు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం పూర్తిగా ఈ ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటుకు క‌ట్ట‌బెట్టేసేందుకు రంగం సిద్ధి చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయం పేరుతో 100 శాతం వాటా విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై నాలుగు రోజుల క్రితం కేంద్ర కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ బడ్జెట్‌లో దీనిపై ప్రతిపాదనలు చేస్తారని సమాచారం. వాస్త‌వానికి ప్ర‌భుత్వాల ఉదాసీన‌త ఉక్కు క‌ర్మాగారంపై మెండుగానే ఉంది. ఫ‌లితంగా విశాఖ ఉక్కు కర్మాగారం కొంతకాలంగా నష్టాలతో నడుస్తోంది. ఉత్పత్తి వ్యయం పెరగడం, డిమాండ్‌ లేకపోవడంతో ఆశించిన అమ్మకాలు జరగడం లేదు. పైగా విశాఖ ఉక్కుకు సొంత గనులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం(ఉద్దేశ పూర్వ‌కంగా కేటాయించ‌లేద‌నే విమ‌ర్శ ఉంది).

ప్ర‌త్యక్షంగా ప‌రోక్షంగా న‌ష్ట‌మే!

దీంతో ముడి ఇనుమును మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటోంది. విశాఖ ఉక్కులో 17 వేల మంది పర్మనెంట్‌ ఉద్యోగులతో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. ఇటీవల కరోనా నేపథ్యంలో కర్మాగారం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఉత్పత్తి తగ్గించుకోవలసి వచ్చింది. అయితే గత డిసెంబరులో స్టీల్‌ రేట్లు పెరగడంతో మంచి అమ్మకాలు జరిగాయి. ఒక్క డిసెంబరులోనే రూ.2,200 కోట్లు విక్రయాలు చేసి, రూ.200 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే ధరలు కొనసాగితే రెండేళ్లలో లాభాల బాటలోకి వస్తుందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. కేంద్ర వ‌దిలించుకునేందుకు రెడీ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏపీకి పెద్ద దెబ్బ‌!

ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి ఏపీకి విభ‌జ‌న హామీల్లో భాగంగారావాల్సినవి రాక‌పోగా.. ఉన్న న‌వ‌ర‌త్న కంపెనీ కూడా పోతే.. ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యంలో రాజ‌కీయాలు మాని.. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఉమ్మ‌డిగా దీనిపై కేంద్రం వ‌ద్ద ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా వంటి కీల‌క విష‌యంలో త‌లోదారి ఎంచుకుని.. ఏపీ ప్ర‌జ‌లకు అన్యాయం చేశార‌నే వాద‌న ఉంది. ఇప్పుడు ఉన్న‌ది కూడా ప్రైవేటుకు ధారాద‌త్తం చేస్తే.. మున్ముందు ఏపీకి మిగిలేది ఏంట‌ని.. ప‌రిశీల‌కులు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.