పార్లమెంటు క్యాంటీన్లో ఇక సబ్సిడీలుండవ్

పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ క్యాంటీన్‌లో సబ్సిడీపై భోజనం అందిస్తుండడంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంపీలు, రాజ్యసభ సభ్యులంతా సామాన్యుల మాదిరిగా రాయితీలు అందుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. మామూలుగా అయితే, నిరుపేదలకు, కార్మికులకు, కొన్ని రంగాల్లోని ఉద్యోగులకు సబ్సిడీపై క్యాంటీన్ లో భోజనం అందిస్తారని….పార్లమెంటులో మన రాజకీయ నేతలకు సబ్సిడీ ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సబ్సిడీ ఎత్తివేయాలని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో సబ్సిడీని తొలగించినట్టు స్పీకర్ ఓం బిర్లా గత వారం ప్రకటించారు. ఈ క్రమంలోనే జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నుంచే సబ్సిడీ లేని ధరలు అమలుకానున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో పార్లమెంటు క్యాంటీన్లో కొత్త మెనూ, ధరలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటివరకు క్యాంటీన్ లో చికెన్ కర్రీని రూ.50 లకు, వెజ్ థాలిని రూ.35 లకు, హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.65, ఉడికించిన కూరగాయలు రూ.12లకు, మూడు కోర్సుల భోజనం ధర రూ.106, సాదా రూ.12లకు అందిస్తున్నారు.

ఇకపై, మారిన ధరల ప్రకారం రోటీ రూ.3, శాకాహార భోజనం రూ.100, వెజ్ బ‌ఫే రూ. 500, నాన్-వెజ్ లంచ్ రూ.700, హైదరాబాద్ మటన్ బిర్యానీ రూ.150, ఉడికించిన కూరగాయలు రూ.50లకు లభించనున్నాయి. గతంలో పార్లమెంట్ క్యాంటీన్‌కు ప్రతి ఏడాది సుమారు రూ.17 కోట్లను సబ్సిడీ కింద చెల్లిస్తున్నారు. తాజాగా సబ్సిడీని ఎత్తివేయడంతో ఏడాదికి రూ.8 కోట్లకు పైగా ఆదా అవుతుంది. కాగా, క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు ఐఆర్‌సీటీసీ లేదా ఐటీడీసీకి అప్పగించనున్నారు.