టీడీపీ మాజీ ఎంఎల్ఏపై కిడ్నాప్ కేసు

భూమా కుటుంబంలో మరొకరిపై కిడ్నాప్ కేసు నమోదైంది. భూమా బ్రహ్మానందరెడ్డిపై నంద్యాల పోలీసులు కిడ్నాప్ కేసు నమోదుచేశారు. నంద్యాల మండలంలోని చాబోలు పాల సొసైటి అధ్యక్షుడు మల్లికార్జునను ఈనెల 2వ తేదీన కిడ్నాప్ చేశారని మాజీ ఎంఎల్ఏతో పాటు నంద్యాల విజయ డైరీ ఛైర్మన్ భూమా నారాయణరెడ్డి, భూమా వీరభద్రారెడ్డి, బాలీశ్వరరెడ్డిపై ఫిర్యాదు కారణంగా పోలీసులు అందరిపైనా కేసులు పెట్టారు.

బుధవారం నంద్యాల విజయడైరీ ఛైర్మన్ పదవితో పాటు మూడు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పాలసొసైటీ అధ్యక్షులు 81 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. డైరెక్టర్లు ఛైర్మన్ను ఎన్నుకుంటారు. మరి పాత కక్షలున్నాయో లేకపోతే డైరీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించే జరిగిందో తెలీదు కానీ సొసైటీ అద్యక్షుడు మల్లికార్జున ఈనెల 2వ తేదీన ఏవి అపార్టుమెంట్ దగ్గర నిలుచుని ఉన్నపుడు హఠాత్తుగా కారులో వచ్చిన మాజీ ఎంఎల్ఏ, నారాయణరెడ్డి అండ్ కో మల్లికార్జునను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు.

వీళ్ళంతా మల్లికార్జునను కారులో ఎక్కించుకుని హైదరాబాద్, తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో తిప్పారు. దాదాపు 20 రోజుల పాటు ఇలా తమ ఆధీనంలోనే ఉంచుకున్న వీళ్ళు కొన్ని తెల్ల కాగితాలతో పాటు మరికొన్ని రిజిస్టర్డ్ కాగితాలపైన కూడా మల్లికార్జునతో సంతకాలు చేయించుకున్నారట. తమకు కావాల్సిన కాగితాలపై సంతకాలు చేయించుకుని మల్లికార్జునను మాజీ ఎంఎల్ఏ అండ్ కో వదిలిపెట్టేశారు.

వెంటనే మల్లికార్జున నంద్యాలలోని పోలీసుస్టేషన్లో పై అందరిపై కిడ్నాప్ కేసు పెట్టారు. జరిగిన విషయాలను విచారించిన పోలీసులు భూమా బ్రహ్మానందరెడ్డి అండ్ కో పై కిడ్నాప్ కేసు నమోదుచేశారు. మొత్తానికి మాజీమంత్రి భూమా అఖిలప్రియ కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నపుడు బ్రహ్మానందరెడ్డి కామ్ గానే ఉన్నారని, ఇటువంటి వాటికి ఆయన దూరమని అందరు అనుకున్నారు. అయితే మాజీ ఎంఎల్ఏ కూడా తన స్ధాయిలో కిడ్నాపులకు పాల్పడుతున్నట్లు తాజా ఘటనతో వెలుగులోకి వచ్చింది. చివరకు భూమా కుటుంబంలో దాదాపు అందరిపైనా కిడ్నాప్ కేసులు నమోదైనట్లే ఉంది.