బీజేపీ రథయాత్రపై ‘పంచాయితి’ ఎఫెక్ట్

బీజేపీ నిర్వహించాలని అనుకున్న రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల ధ్వంసం తదితర కారణాలతో బీజేపీ రథయాత్ర చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్రకు రూటుమ్యాపు కూడా రెడీ చేసుకున్నది. యాత్ర కోసం పోలీసులను అనుమతి కూడా కోరారు.

అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవటంతో రథయాత్రకు బ్రేకులుపడ్డాయి. సుప్రింకోర్టు తీర్పు వల్ల పంచాయితి ఎన్నికలను ఆటంకాలు తొలగిపోవటంతో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజైపోయింది. పైగా ఏకగ్రీవాలు జరక్కుండా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయటంతో దాదాపు అన్నీ పంచాయితిల్లోను ఎన్నికలు అనివార్యమయ్యేట్లుంది.

ఈ నేపధ్యంలోనే బీజేపీ+జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో నామినేషన్లపై దృష్టిపెట్టాయి. మొదటిదశలో ఎన్నికలు జరగబోయే ప్రతి పంచాయితిలోను మిత్రపక్షాల తరపున నామినేషన్ల వేయించాలని ఇఫ్పటికే డిసైడ్ చేశాయి. అందుకనే ఎన్నికల్లో పోటీ చేయటానికి ప్రాధాన్యత ఇచ్చి రథయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.

ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్ర ప్రారంభమైతే రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట గొడవలు జరగటం ఖాయమనే అందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ మతపరమైన రాజకీయాల జోరు పెంచింది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి హిందుమతానికి వ్యతిరేకమనే నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ నినాదం కారణంగా గొడవలు జరుగుతాయని అనుకున్నారు. అయితే పంచాయితి ఎన్నికల కారణంగా రథయాత్ర వాయిదా పడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.