ఎర్రకోటపై రైతు జెండా.. ఇది దేనికి సంకేతం?

ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని వేలెత్తి చూపించాలి? గెలుపోటములు పక్కన పెట్టేద్దాం. దేశ గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ జాతీయ పతాకం పక్కగా.. నిరసన జెండా ఎగరటం దేనికి సంకేతం? ఎవరికి వారు తమ వాదనల్ని బలంగా వినిపించొచ్చు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా ఎగిరిన రైతు జెండా.. మోడీ సర్కారు మొండితనానికి చెంపదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో.. మరే ప్రదేశంలో అయినా ఇలాంటివి బాగానే ఉండేవి. దేశ గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక ప్రదేశంలో.. రైతు నిరసన జెండా ఎగురటం సరికాదన్న మాట వినిపిస్తోంది.

సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. జాతి ఔనత్యాన్ని ప్రతీకగా నిలిచే చోట.. నిరసనల్ని ప్రదర్శించక తప్పదా? అన్నదే ప్రశ్న. ఇప్పటివరకు రైతులకు దన్నుగా నిలిచిన ఎంతోమంది.. తాజాగా చేసిన చేష్టను మాత్రం తప్పు పడుతున్నారు. నిరసనకు ఒక పద్దతి ఉంటుందని.. దాన్ని అతిక్రమించే తీరు సరికాదంటున్నారు. మరోవైపు.. రైతుల చర్యలకు వత్తాసు పలికే వారు లేకపోలేదు.

తమ హక్కుల సాధనం కోసం నెలల తరబడి నిరసన చేస్తున్న రైతులు.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఎర్రకోట వద్ద తమ ఉద్యమ జెండాను ఎగురవేయటం సంచలనంగా మారింది. బారికేడ్లు.. లాఠీలు.. టియర్ గ్యాస్ ఆందోళన మధ్య రైతులు నిర్వహించిన ట్రాక్టర్ర పరేడ్ ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది.

ఇలాంటి అడ్డంకుల్ని ఎన్నింటినో అధిగమించి ఎర్రకోటకు చేరుకున్న పలువురు రైతులు.. ఎర్రకోట వద్ద నిరసన జెండాను ఎగురవేశారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక.. సెంట్రల్ ఢిల్లీలో ఆందోళనకారులు చొచ్చుకురావటానికి ప్రయత్నించిన రైతుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటమే కాదు.. రైతులపై బాష్ప వాయువును ప్రయోగించారు. రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంలో రైతులే కాదు.. పోలీసులు కూడా గాయపడ్డారు.