ఈ ఒక్క ఫోటో చాలు.. ఏపీలో మార్పును కళ్లకు కట్టేలా చేస్తుంది

అలుపు లేకుండా.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున సంక్షేమ పథకాలు.. అంతకు మించి పాలనలో జగన్ మార్కును వేసే నిర్ణయాలతో పాటు.. పథకాల అమలుకు పడుతున్న శ్రమ కళ్లకు కట్టేలా ఫోటోగా దీన్ని చెప్పాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే.. రేషన్ బియ్యాన్ని లబ్థిదారుల ఇళ్లకే పంపిణీ చేసే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన జగన్ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు (గురువారం) నుంచి రేషన్ బియ్యాన్ని.. నేరుగా లబ్థిదారుల ఇళ్లకు చేర్చే వాహనాల్ని సిద్ధం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేసే సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు.. తాజాగా అందుకు అవసరమైన వాహనాల్ని రాష్ట్ర వ్యాప్తంగా సమకూర్చుకుంది. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు రేషన్ షాపు వద్దకు వెళ్లటం.. అక్కడ గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ కారణంగా రోజువారీ పనులకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందికి గురయ్యే పరిస్థితి. ఇలాంటి వారికి కష్టం లేకుండా.. ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసేలా వినూత్న డెలివరీ విధానాన్ని సిద్ధం చేసిన ఏపీ సర్కారు.. అందుకు తగ్గట్లే రాష్ట్ర వ్యాప్తంగా 9260 వాహనాల్ని సిద్ధం చేసింది.

ప్రత్యేక వాహనాలతో ఇంటి వద్దకే రేషన్ సరుకుల్ని డెలివరీ చేసే ఈ విధానం కోసం మూడు జిల్లాలకు సంబంధించిన 2500 రేషన్ వాహనాల్ని విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిలిపి ఉంచారు. వీటిని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం ఈ వాహనాల్ని.. వాటికి నిర్దేశించిన ప్రాంతానికి పయనమవుతాయి. ఒకేచోట 2500 వాహనాల్ని సిద్ధం చేసిన సీన్ ను చూస్తే.. మార్పు కోసం జగన్ ప్రభుత్వం ఎంతలా తపిస్తుందో ఇట్టే అర్థమవుతుంది.

కొసమెరుపు : గతంలో అంబులెన్సుల ఆవిష్కరణ కూడా ఇలాగే చేశారు. ఇపుడు మళ్లీ అదే స్టైల్లో ఈ వాహనాల ప్రారంభం జరుగుతోంది. పబ్లిసిటీకి పబ్లిసిటీ… చేస్తున్నది సాధారణ పని అయినా దాని ముద్ర బలంగా ఉండాలంటే లాంచింగ్ కూడా అట్లే ఉండాలన్న దానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తోంది వైసీపీ సర్కారు.