కృష్ణంరాజు చెప్పిన‌ రాధేశ్యామ్ సీక్రెట్లు

2021లో అత్య‌ధిక అంచ‌నాల‌తో రాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ ఒక‌టి. బాహుబ‌లితో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న సినిమా కావ‌డంతో దీనికి మంచి హైపే ఉంది. బాహుబ‌లి త‌ర్వాత సాహో డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ ఇమేజ్‌కు పెద్ద దెబ్బేమీ ప‌డ‌లేద‌ని అత‌డి సినిమాల లైన‌ప్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

రాధేశ్యామ్ విష‌యానికి వ‌స్తే త‌న ఇమేజ్‌కు భిన్నంగా క్లాస్ ల‌వ్ స్టోరీ చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఇప్ప‌టిదాకా పెద్ద‌గా రివీల్ చేసిందేమీ లేదు. సినిమా పోస్ట‌ర్లు చూస్తే ఇదొక వింటేజ్ ల‌వ్ స్టోరీ అని మాత్ర‌మే అర్థ‌మ‌వుతోంది. టీజ‌ర్ వ‌స్తే క‌థాక‌థ‌నాల‌పై ఓ అంచ‌నా వ‌స్తుందేమో. ఐతే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఏ ద‌శ‌లో ఉంది, ఎప్పుడు రిలీజ‌వుతుందనే విష‌యంలోనూ క్లారిటీ లేదు. వేస‌వి విడుద‌ల అన్న‌ది మాత్ర‌మే తెలుసు.

ఐతే ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో రాధేశ్యామ్‌కు సంబంధించి కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఇప్ప‌టిదాకా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని ఓ రాధేశ్యామ్ సీక్రెట్‌ను కృష్ణంరాజు పంచుకున్నారు. ఈ చిత్రంలో కృష్ణం రాజు కూడా ఓ కీల‌క పాత్ర చేస్తున్నార‌ట‌. ఆ పాత్ర పేరు ప‌ర‌మ‌హంస అని, తాను ఓ మ‌హాజ్ఞానిలా క‌నిపిస్తాన‌ని.. ఈ పాత్ర కోసం గ‌డ్డం పెంచి డిఫ‌రెంట్ లుక్ ట్రై చేశాన‌ని.. ప్ర‌భాస్‌, త‌న కాంబినేష‌న్లో వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలను ఇంకా చిత్రీక‌రించాల్సి ఉంద‌ని కృష్ణం రాజు వెల్ల‌డించారు.

ఇక సినిమా ఎలా ఉంటుంద‌ని అడిగితే.. రెండేళ్ల పాటు ఆలోచించి చేసిన సినిమా ఇద‌ని, అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ని విధంగా ఉంటుంద‌ని అన్నారు. రాధేశ్యామ్‌ను ఏప్రిల్లో విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు కూడా కృష్ణంరాజు వెల్ల‌డించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేష‌న్స్‌తో క‌లిసి కృష్ణంరాజే నిర్మిస్తుండ‌టం విశేషం.