హైదరాబాద్ లోనే కృష్ణబోర్డు కార్యాలయం ?

జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ అసంబద్ద నిర్ణయం చిలికి చిలిక గాలివానలాగ తయారవుతోంది. సర్కారు నిర్ణయం ఫలితంగా కృష్ణా యాజమాన్య బోర్డు ప్రదాన కార్యాలయం మరికొంతకాలం హైదరాబాద్ లోనే కంటిన్యు అయ్యే పరిస్ధితులు కనబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రం విభజన జరగకముందు గోదావరి యాజమాన్యబోర్డు, కృష్ణా యాజమాన్య బోర్డులు ఉన్నాయి. అయితే విభజనలో గోదావరి యాజమాన్య బోర్డును తెలంగాణాకు, కృష్ణాబోర్డును ఏపికి కేటాయించారు.

కేటాయింపులు జరిగిపోయినా వివిధ కారణాల వల్ల రెండుబోర్డులూ ఇఫ్పటికీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఏపికి కేటాయించిన కృష్ణాబోర్డు ఇంకా హైదరాబాద్ లోనే కంటిన్యు అవటం ఏమిటంటు ప్రభుత్వం గట్టిగా కేంద్ర జలశక్తిని నిలదీసింది. దాంతో వెంటనే కృష్ణాబోర్డు ఏపికి తరలించాలని జలశక్తి ఆదేశాలిచ్చింది. మొత్తానికి అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇక్కడే జగన్ సర్కార్ ఓ అసంబద్దమైన నిర్ణయాన్ని తీసుకుంది.

హైదరాబాద్ నుండి తరలించే కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని వైజాగ్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కృష్ణాబోర్డుకు వైజాగ్ కు ఏ విధంగాను సంబంధం లేదు. మామూలుగా కృష్ణానది పారే ప్రాంతాల్లోనే బోర్డు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల నీటి యాజమాన్య పర్యవేక్షణ, వివాదాల పరిష్కారం, సమావేశాలు అన్నింటికీ ఉపయోగంగా ఉంటుంది. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సమాఖ్య కూడా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది.

సమాఖ్య చెప్పినా వినకుండా బోర్డును విశాఖలో ఏర్పాటు చేయటానికే ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీంతో తెలంగాణా ప్రభుత్వం కూడా తన అభ్యంతరాలను కేంద్ర జలశక్తికి చెప్పింది. నిజానికి కృష్ణాబోర్డు కార్యాలయం ఉండాల్సింది రాయలసీమలోని కర్నూలు జిల్లాలో. ఎందుకంటే కృష్ణానీళ్ళు కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ప్రాంతంగుండానే ఏపిలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడ కాకపోతే కృష్ణాజలాలు పారే కోస్తా జిల్లాల్లో కూడా పెట్టుకోవచ్చు.

కానీ ప్రభుత్వం మాత్రం ఇటు కర్నూలు జిల్లా కాక అటు కృష్ణాజలాలు పారే జిల్లాలూ కాకుండా బంగాళాఖాతం ఉండే వైజాగ్ లో ఎందుకు పెట్టాలని అనుకుంటోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. వివిధ రూపాల్లో వచ్చిన అభ్యంతరాలను కేంద్ర జలశక్తి ప్రభుత్వం ముందుంచింది. దీనికి రాష్ట్రప్రభుత్వం ఎటువంటి సమాదానం ఇవ్వలేదు. దాంతో వివాదాస్పదమైన తరలింపును కొంతకాలం నిలిపేయాలని డిసైడ్ అయ్యింది. అంటే మరికొంత కాలంపాటు కృష్ణాబోర్డు కార్యాలయం హైదరాబాద్ లోనే కంటిన్యు అవకాశాలు కనబడుతున్నాయి.