రైనా-చెన్నై.. భలే ట్విస్టు


గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సందర్భంగా చర్చనీయాంశం అయిన పేరు.. సురేశ్ రైనాదే. అతనేమీ ఈ టోర్నీలో ఆడలేదు. అయినా చాన్నాళ్ల పాటు వార్తల్లో ఉన్నాడు. టోర్నీ ఆరంభం కాబోతుండగా వ్యక్తిగత కారణాలు చెప్పి అతను స్వదేశానికి వచ్చేయడం సంచలనం రేపింది. అందుకు కారణాలేంటనే విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి.

అతను తనకు స్పెషల్ సూట్ ఇవ్వనందుకు హర్టయ్యాడని కొందరంటే.. కాదు కాదు మేనత్త హత్యతో కలత చెంది వచ్చేశాడని ఇంకొందరు అన్నారు. మరికొందరేమో కరోనా భయంతోనే అతను వెనుదిరిగినట్లు చెప్పుకున్నారు. ఐతే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అతడికి మధ్య ఏదో తేడా జరిగిందనే అనుమానాలు బలంగా వినిపించాయి. అసలు కారణం వేరే ఉందని.. రైనా మళ్లీ ఐపీఎల్‌కు వస్తానన్నా కూడా ఆ ఫ్రాంఛైజీ అంగీకరించలేదని గుసగుసలు వినిపించాయి.

కట్ చేస్తే ఇంకో రెండున్నర నెలల్లో ఐపీఎల్ 14వ సీజన్ జరగబోతోంది. ఇందుకోసం వచ్చే నెలలో మినీ వేలం నిర్వహించనున్నారు. దాని కంటే ముందు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లెవ్వరో, విడిచిపెట్టే ఆటగాళ్లెవరో తేల్చుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆ జాబితా బయటికి రానుంది. కాగా రైనాకు, చెన్నై ఫ్రాంఛైజీకి చెడిన నేపథ్యంలో ఇన్నేళ్ల బంధానికి తెరపడబోతోందని.. రైనాను ఆ సీఎస్కే విడిచిపెట్టనుందని మీడియాలో గట్టి ప్రచారమే జరిగింది.

రైనా ఫామ్ కూడా ఏమంత బాగా లేకపోవడంతో అతడి కోసం రూ.11 కోట్లు పెట్టడం అనవసరం అని కూడా చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. చెన్నైతో రైనాకు కటీఫ్ అయినట్లే అని.. చిన్న తలా అనే పేరు రైనాకు పోయినట్లే అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ తీరా చూస్తే రైనా.. చెన్నైతోనే కొనసాగబోతున్నాడని తేలింది. రైనాను తమ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకోనున్నట్లు సీఎస్కే అధికారి ఒకరు ఒక ఇంగ్లిష్ డైలీకి కన్ఫమ్ చేశాడు. దీంతో కొత్తగా ఇదేం ట్విస్టు అంటూ ఆశ్చర్యపోవడం అభిమానుల వంతవుతోంది.