దుమారం రేపుతున్న వెబ్ సిరీస్

వరల్డ్ టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ ఇండియాలో రూపొందించే వెబ్ సిరీస్‌లపై తరచుగా వివాదాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మనవాళ్ల సెంటిమెంట్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీసే కాన్సెప్ట్‌లతో ఈ సంస్థలు సిరీస్‌లు నిర్మిస్తున్నాయనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి.

ఈ కోవలో ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూపొందించిన ‘తాండవ్’ వెబ్ సిరీస్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇటీవలే ప్రైమ్‌లో విడుదలైన ఈ సిరీస్‌కు బ్యాడ్ రివ్యూలు వచ్చాయి. ఇండియాలో వచ్చిన పేరున్న వెబ్ సిరీస్‌ల్లో అత్యంత పేలవమైన వాటిలో ఇదొకటిగా చెబుతున్నారు. ఐతే అదే సమయంలో ఈ సిరీస్‌‌లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి.

హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉద్దేశపూర్వకంగా కొన్ని సన్నివేశాలు పెట్టారని.. హిందూ దేవుళ్లను కించపరిచారని ‘తాండవ్’ సిరీస్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం రేపి సిరీస్‌కు ప్రచారం తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి సన్నివేశాలు కావాలని పెడుతున్నారని.. హిందూ దేవుళ్లను తప్ప ఇతర మతాల దేవుళ్ల జోలికి ఎప్పుడూ వెళ్లరని.. హిందువులంటే అలుసైపోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది ఓ వర్గం నుంచి.

‘తాండవ్’ సిరీస్‌ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఉత్తరాదికి చెందిన కొందరు రాజకీయ నాయకులు సైతం ‘తాండవ్’కు వ్యతిరేకంగా మాట్లాడారు. దాన్ని బ్యాన్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇంతకుముందు అమేజాన్ ప్రైమ్ రిలీజ్ చేసిన ‘పాతాళ్ లోక్’ విషయంలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. ‘తాండవ్’ను ‘సుల్తాన్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించాడు. ఈ సిరీస్‌కు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, జనాలే దాన్ని చూడరు అంటున్నారు నెటిజన్లు.