చివరకు కోడిపుంజులే గెలిచాయి

చివరకు కోడిపుంజులే గెలిచాయి. ప్రతిఏటా సంక్రాంతి సందర్భంగా జరుపుకునే కోళ్ళపందేలను ఈసారి ఎలాగైనా అడ్డుకోవాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. దానికి తగ్గట్లే హైకోర్టు కూడా కోళ్ళపందేలు జరగకుండా చూడమని పోలీసులను గట్టిగా హెచ్చరించటంతో ఈసారి కోడిపందేలు అనుమానమేనా అనిపించింది. కానీ పండుగ మొదటిరోజైన భోగిపండుగ నాడు యధావిధిగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ళపందేలు మొదలయ్యాయి. మొదటిరోజే సుమారు రూ. 100 కోట్లు పందెంలో భాగంగా చేతులు మారినట్లు సమాచారం.

ఇక్కడ పోలీసులైనా, కోర్టులైనా గ్రహించాల్సింది ఒకటుంది. అదేమిటంటే తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఎలా జరుగుతాయో ఏపిలో కోళ్ళపందేలు అలాగే జరుగుతాయి. కోళ్ళపందేలు జరపటమన్నది చాలా ఊర్లలో పెద్ద ప్రిస్టేజి యవ్వారం. గ్రామాల్లో మోతుబరులింతమంది ఉండి కూడా కోళ్ళపందేలు జరపలేకపోయారంటే దాన్ని వాళ్ళంతా చాలా అవమనాంగా భావిస్తారు. అందుకనే కోళ్ళపందేలకు చాలా ముందునుండే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటారు. భోగిపండుగ రోజు మొదలైన పందేల్లో వైసీపీ ఎంపిలు లావు శ్రీకృష్ణదేవరాయులు, వల్లభనేని బాలశౌరి లాంటి అనేకమంది ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలను ప్రారంభించారు.

మోతుబర్లు, పందెం రాయళ్ళు కలిసే పందేలకు అవసరమైన బరులను సిద్ధం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కోళ్ళపందేల విషయంలో అధికారపార్టీ, ప్రతిపక్షమనేది ఉండదు. రాజకీయ నేతలంతా కలిసిపోయి పందేలు నిర్వహిస్తారు కాబట్టే పోలీసులు కూడా ఎవరినీ ఏమీ చేయలేకపోతున్నారు. ఇపుడు కుక్కునూరు మండలంలోని ఏలేరు, నిడదవోలు మండలంలోని సింగవరం, తాడిమళ్ళ, భీమవరం మండలంలోని వెంప, కాళ్ళమండలంలోని సీసలి గ్రామాల్లో పెద్దఎత్తున కోళ్ళపందేలు మొదలైపోయాయి. అనపర్తి, రాజోలు, పాశవరం, ఏలూరు లాంటి ప్రాంతాల్లో కూడా పందేలు జరిగయి.

ప్రజాసంకల్పం ముందు పోలీసులైనా, కోర్టులైనా చేయగలిగేది ఏమీ ఉండదన్నది వాస్తవం. మెజారిటి ప్రజలు కోళ్ళపందేలను కోరుకుంటున్నపుడు కోర్టులు, పోలీసులు చేయగలిగేది ఏమీ లేదన్నది తాజాగా మరోసారి నిరూపణైంది. కాబట్టి కోళ్ళపందేల నిర్వహణ విషయంలో కోర్టులు, పోలీసులు పట్టించుకోకపోవటమే ఉత్తమం అన్నట్లుగా ఉంది క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు.