అఖిలను పట్టించిన ఫోన్ కాల్

ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఏదో తప్పుచేసి దొంగలు దొరికిపోతారనేది పోలీసుల ప్రాధమిక విశ్వాసం. ఈ విశ్వాసం ఆధారంగానే చాలా కేసులను పోలీసులు ఛేదిస్తుంటారు. తాజాగా బోయినపల్లిలోని సోదరుల కిడ్నాప్ కేసులో కూడా అలాగే జరిగింది. ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కిడ్నాప్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులోనే మాజీమంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు.

సరే ఇక విషయానికి వస్తే కిడ్నాప్ జరిగిన రోజున నిందితులు వాడిని ఓ ఫోన్ నెంబరే వాళ్ళని పట్టించింది. ఎప్పుడైతే సోదరులు కిడ్నాప్ అయ్యారో వెంటనే కుటుంబసభ్యులు పోలీసులతో పాటు మీడియాకు సమాచారం ఇచ్చారట. దాంతో సీఎం బంధువుల కిడ్నాప్ అంటూ విపరీతంగా వాయించేసింది మీడియా. దాంతో టీవీల్లో వస్తున్న వార్తలను చూసిన పోలీసులు నగరంలోని అన్నీ చెక్ పోస్టుల దగ్గర హెవీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో విషయం అర్ధమైపోయిన కిడ్నాపర్లు సోదరులను నగరం దాటించటం కష్టమని అర్ధం చేసుకున్నారు.

అందుకనే కారులో నుండి సోదరుల్లో ఒకరితో కిడ్నాపర్లు పోలీసులకు ఫోన్ చేయించారు. తాము క్షేమంగానే ఉన్నామని తమగురించి వెతకాల్సిన అవసరం లేదన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. అంతా బాగానే ఉంది కానీ మరి ఫోన్ సమాచారం అందుకున్న పోలీసులు తమకు ఫోన్ వచ్చిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. అయితే సోదరుల ముగ్గురి ఫోన్లు ఇంట్లోనే ఉన్న విషయాన్ని కుటుంబసభ్యులు చెప్పారట పోలీసులతో.

సోదరుల ఫోన్లు ఇంట్లోనే ఉంటే మరి ఎవరి ఫోన్ నుండి తమతో మాట్లాడారనే విషయాన్ని పోలీసులు కూపీలాగటం మొదలుపెట్టారు. తమకు వచ్చిన ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేశారు. అలాగే ఆ నెంబర్ పై మొబైల్ డేటాను బయటకు తీయించారు. దాంతో విషయమంతా ఒక్కసారిగా బయటపడిపోయింది. కేవలం కిడ్నాప్ కోసమనే నిందితులు ఆరు సిమ్ కార్డులు తీసుకున్నారు. వాటిల్లో ఒకదానిలో నుండే సోదరులతో కిడ్నాపర్లు పోలీసులకు ఫోన్ చేయించారు. ఇంకేముంది మొబైల్ డేటాను పూర్తిగా బయటకు తీసినపుడు అందులో ఒక నెంబర్ ప్రముఖంగా కనిపించిందట. దాన్ని ఆరాతీస్తే ఆ నెంబర్ మాజీమంత్రి భూమా అఖిలదని తేలింది. దాంతో పోలీసులు అఖిలను అరెస్టు చేశారు.