అల్లుడికి బేనర్ రాసిచ్చేశారా?

వైజయంతీ మూవీస్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అశ్వినీదత్ కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పేరుతో కొత్త బేనర్ పెట్టి చిన్న సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు దశాబ్దం కిందట. ఐతే వారికి ఆశించిన ఆరంభం దక్కలేదు. మొదట్లో ఈ బేనర్ మీద తీసిన సినిమాలన్నీ పోయాయి. ఐతే నాగ్ అశ్విన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ స్వప్న సినిమా బేనర్‌కు తొలి విజయాన్నందించింది. తర్వాత ఈ సంస్థ వైజయంతీ మూవీస్‌తో కలిసి తీసిన ‘మహానటి’ సంగతి చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు ‘స్వప్న సినిమా’ నుంచి రానున్న కొత్త సినిమా.. జాతి రత్నాలు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల ఆసక్తికర కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకుముందు ‘పిట్టగోడ’ సినిమా తీసిన అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాకు నిర్మాతగా నాగ్ అశ్విన్ పేరు పడుతుండటం విశేషం. స్వప్న సినిమా బేనర్లో కొత్తగా వచ్చిన మార్పు ఇది.

ఇన్నాళ్లూ అశ్వినీదత్ కూతురు స్వప్న పేరు బేనర్లో ఉంటే.. నిర్మాతగా ప్రియాంక దత్ పేరు పడేది. కానీ ఇప్పుడు ఆమె భర్త అయిన నాగ్ అశ్విన్ పేరు నిర్మాత స్థానంలోకి వచ్చింది. దీంతో ఈ బేనర్‌ను అశ్విన్‌కు రాసిచ్చేశారా అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఐతే ‘మహానటి’ తర్వాత అశ్విన్ స్థాయి అమాంతం పెరిగిపోవడం, ఏకంగా ప్రభాస్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని అతను దక్కించుకున్న నేపథ్యంలో తన పేరును వాడుకుంటే సినిమాకు పబ్లిసిటీ పరంగా కలిసొస్తుందని నిర్మాతగా నాగ్ అశ్విన్ పేరు వేసి ఉండే అవకాశం కూడా ఉంది.

ఈ సినిమా స్క్రిప్టు చర్చల్లో, అలాగే ప్రొడక్షన్లో నాగ్ యాక్టివ్ రోల్ ప్లే చేశాడట. అతడి క్రియేటివ్ ఇన్ పుట్స్ సినిమాకు బాగానే ఉపయోగపడినట్లు చెబుతున్నారు. మొన్న రిలీజ్ చేసిన నవీన్ పాత్ర టీజర్, తాజాగా రిలీజ్ చేసిన చిట్టి సాంగ్‌‌ చూస్తే ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందనే ఫీలింగ్ కలుగుతోంది. మరి నిర్మాతగా నాగ్ అశ్విన్ తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.