ట్రంప్ పై అభిశంసన తీర్మానం ?

గడచిన కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాను యావత్ ప్రపంచం ముందు తలొంచుకునేట్లుగా వ్యవహరించిన ఔట్ గోయింగ్ అధ్యక్షుడు డొనాలడ్ జే ట్రంప్ పై అభిశంసన తీర్మానం రెడీ అయింది. తీర్మాన్ని ప్రవేశపెట్టడమే మిగిలిందని స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించారు. నాలుగురోజుల క్రితం అమెరికన్ పార్లమెంటు భవనమైన క్యాపిటిల్ బిల్డింగ్ పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులు, బీభత్సకాండ చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అమెరికాలోని అన్నీ రాష్ట్రాల నుండి తన మద్దతుదారులను భారీగా వాషింగ్టన్ కు పిలిపించుకుని మరీ క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ దాడులకు ప్రోత్సహించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

దాడులు జరిగిన తర్వాత రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ వైఖరిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అసలే ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుతో అమెరికా ప్రపంచదేశాల ముందు బాగా పలుచనైపోయింది. ఇన్ కమింగ్ అధ్యక్షుడు జో బైడెన్ ఈనెల 20వ తేదీన అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సరే ఏదోలా కొద్ది రోజులు ట్రంప్ ను భరిస్తే సరిపోతుందని అందరు సర్దుకుపోతున్నారు. అలాంటిది పదవీకాలం ముగిసేముందు ట్రంప్ ఇటువంటి పనిచేస్తారని ఇటు డెమక్రాట్లు అటు రిపబ్లికన్లు కూడా ఊహించలేదు.

అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలినపోయిన క్యాపిటల్ బిల్డింగ్ ఘటనకు కారకుడంటు ఇప్పటికే పార్లమెంటు మెజారిటి సభ్యులు ట్రంప్ పై అనేక ఫిర్యాదులు చేశారు. దాంతో ట్రంప్ ను 20వ తేదీ వరకు కూడా అధ్యక్షుడిగా కంటిన్యు చేయకూడదనే ఉద్దేశ్యంతోనే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పార్లమెంటులోని మెజారిటి ఎంపిలు డిసైడ్ అయ్యారు. ఒకవేళ 20వ తేదీలోగా తీర్మానంపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోయినా సరే ట్రంప్ ను అభిశంసించినట్లుగా తీర్మానం చేయాలని మెజారిటి ఎంపిలు భావిస్తున్నట్లు అమెరికా మీడియా చెబుతోంది.

మొత్తానికి పదవిలో నుండి దిగిపోతు ట్రంప్ చేసిన పని వల్ల మొత్తం దేశంలోనే ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. 20వ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ఏ క్షణంలో ఏమవుతుందో అన్న టెన్షన్ అమెరికాలో పెరిగిపోతోంది. అందుకనే ముందుజాగ్రత్తగా అమెరికాలోని సెన్సిటివ్ రాష్ట్రాలు, వాటిలో మరీ సున్నితమైన నగరాలుగా గుర్తించిన ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసుల బలగాలను దించేశారు. దేశంమొత్తం మీద నిఘావ్యవస్ధను రంగంలోకి దింపేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి దాడిలో ఆందోళనకారులకు పోలీసుల్లో కొందరు సహకరించినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసిందట.