ఇంతకీ.. హఫీజ్ పేట్ లోని వివాదాస్పద భూమి చరిత్రలోకి వెళితే..

హఫీజ్ పేట సర్వే నెంబరు 80 చుట్టూనే ఈ వివాదం నడుస్తుంది. అలా అని.. దాని చుట్టుపక్కల వివాదం లేదని కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న భూములు కూడా వివాదమే. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే.. హాఫీజ్ పేటలో వివాదంలో ఉన్న భూముల విలువ స్థానిక మార్కెట్ లెక్కల ప్రకారం రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని చెబుతారు. ఇక.. తాజా వివాదానికి సంబంధించి చూస్తే.. సర్వే నెంబరు 80 కింద 484.31 ఎకరాల భూమి ఉంటుంది. ధరణి వెబ్ సైట్ లో ఇదే సర్వే నెంబరును కొట్టి చూస్తే.. ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే.. ప్రభుత్వభూమి అని అర్థం. ఈ భూములకు సంబంధించిన చరిత్రలోకి వెళితే..

1929లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ భూముల్ని ఖుర్షీద్ జాహీ పాయ్ గా.. చావూస్.. నవాబ్ వంశీయులకు ఇచ్చినట్లు చెబుతారు. ఎందుకంటే.. నిజాం రాష్ట్ర రైల్వే నిర్మాణ సమయంలో ఈ వంశీయుల భూముల్ని అప్పటి ప్రభుత్వం సేకరించింది. అందుకు బదులుగా వారికి ఈ భూముల్ని ఇచ్చారంటారు. అయితే.. జాగీర్దార్ వ్యవస్థ రద్దు అయ్యాక.. ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై పాయ్ గా వారసుల్లో కొందరు 1958లో దీనిపై కోర్టును ఆశ్రయించారు.

తమ వాటా భూములను గ్రేటర్ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్ చేశారు. ఆ సమయంలో నిజాం ప్రభువే ఈ భూమిని కొనుగోలు చేసినట్లుగా ఉన్న లింకు డాక్యుమెంట్ ను జత చేశారు. 1929లోనే ఫర్మాన్ అయ్యాక.. మళ్లీ నిజాం ఆ భూముల్ని ఎందుకు కొంటారని మిగిలిన వారసులు ప్రశ్నించారు. అప్పటినుంచి ఈ భూమిపై కేసు కోర్టులో ఫైల్ అయ్యింది. 1968 జూన్ 28న హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిక్రీ ఇచ్చింది. ఇప్పటివరకు ఎవరూ ఫైనల్ డిక్రీని పొందలేదు.

ప్రిలిమినరీ డిక్రీ వచ్చాక.. హక్కుదారులెవరూ భూముల్ని స్వాధీనం చేసుకోవటానికి ముందుకు రాలేదు. కొండలు.. గుట్టలు. అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్ మెంట్ డీడ్ చేసుకోవటానికి ఆసక్తి చూపలేదు. దీంతో.. సర్వే నెంబరు 80 లోని భూములన్ని ప్రభుత్వానివే అని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. ఇందుకు తగ్గట్లే ధరణి వెబ్ సైట్ లోనూ నిషేధిత జాబితాలో పెట్టింది. ఇదిలా ఉంటే.. ఈ సర్వే నెంబరు 80లోని భూముల్ని ఎవరికి వారుగా కాలనీలు.. ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు.

అలా 1983-84లో సుభాష్ చంద్రబోస్ నగర్ పేరుతో వెంచర్ వేశారు. కబీర్ నవాబ్ అనే వ్యక్తి గజం రూ.15 చొప్పున భూముల్ని అమ్మారు. అదే సమయంలో ప్రేమ్ నగర్.. మార్తాండనగర్ పేరుతో ఇస్మాయిల్.. పాయ్ గా కాలనీ పేరుతో పాయ్ గా వారసులు.. మరికొన్నిపేర్లతో ప్లాట్లను అమ్మారు. అలా భూములు చేతులు మారుతూ వచ్చాయి. హైటెక్ సిటీ రావటం.. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల డెవలప్ మెంట్ వాయువేగంతో దూసుకెళ్లింది. హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఈ భూములు ఉండటంతో ఈ భూమి విలువ శారీగా పెరిగింది. దీనికి తోడు కోర్టు వివాదాలు పెరిగిపోయాయి.

ఈ భూములకు సంబంధించిన వివాదాల్లో భాగంగా 1989లో సాబేర్ చావూస్ ను అతడి ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. సాబేర్ తండ్రి తన ప్రత్యర్థులపై బేగంబజార్ లో బాంబుతో దాడి చేయించాడు. తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత మాదాపూర్ లో అబూబకాస్ ను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. ఇప్పుడు వివాదం నడుస్తున్న భూమికి సంబంధించి కూడా శేఖర్ నాయుడు అనే రియల్టర్ ను ప్రభాకర్ రాయుడు అనే వ్యక్తి 2005లో హత్య చేయించాడు. ఆ తర్వాత ప్రభాకర్ రాయుడు పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. తాజాగా ప్రవీణ్ కుమార్.. అతడి సోదరుల కిడ్నాప్ కు ఈ భూములే ప్రధాన కారణంగా మారాయి. ఇలా దారుణ నేరాలకు.. హత్యలకు కారణమైన ఈ భూములు మరోసారి తెర మీదకు వచ్చాయి.