తిరుపతి ఉపఎన్నికకు బండి ఇన్చార్జా ?

Bandi Sanjay
Bandi Sanjay

చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు తిరుపతిలో బీజేసీ+జనసేన అభ్యర్ధిని గెలిపించే బాధ్యతను పార్టీ అగ్రనాయకత్వం అప్పగించినట్లే ఉంది. లేకపోతే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బైబిల్ పాలన కావాలా ? లేకపోతే భగవద్గీత పాలన కావాలో జనాలు తేల్చుకోవాలని పిలుపువ్విటమే ఆశ్చర్యంగా ఉంది. బండి మాటలు వింటుంటే తెలంగాణాలో జరిగిన ఎన్నికల సమయంలో జనాలను ఎంతగా రెచ్చగొట్టారో అందరికీ తెలిసిందే.

తెలంగాణాలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో కానీ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికలో కానీ బండి జనాల భావోద్వేగాలను ఏ స్ధాయిలో రెచ్చగొట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో అంటే ఓల్డ్ సిటి ఉన్నది కాబట్టి బండి ఆటలు సాగాయి. మరి ఏపిలో కూడా అలాగే సాగుతుందా ? అసలు తిరుపతిలో బండి పప్పులుడుకుతాయా అన్నది అనుమానమే.

ఎందుకంటే ఏపిలో మత రాజకీయాలకు ఎప్పుడు కూడా చోటు లేదు. ఎక్కడన్నా ఉంటే కులాలపరంగా ఓట్లు చీలుతాయే కానీ మతపరంగా ఓట్లు చీలిన ఘటనలు లేవు. పైగా ఎవరెంతగా మతాల పేరుతో జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా సాధ్యంకాలేదు. గతంలో కూడా బీజేపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు. కాబట్టి బండి సంజయ్ వ్యూహం ఏపిలోను అందులోను తిరుపతి ఉపఎన్నికలో పారదనే అనుకుంటున్నారు.

ఇక పార్టీ విషయానికి వస్తే ఏపిలో ఎన్నికకు తెలంగాణా అధ్యక్షుడు బండి యాక్టివ్ అవుతున్నారంటే మరి సోము వీర్రాజు పరిస్దితి ఏమిటి ? తెలంగాణాలో జరిగిన రెండు ఎన్నికల్లో బండి మంచి ఫలితాలు చూపించారు కాబట్టి ఏపిలో తిరుపతి ఉపఎన్నికకు కూడా బండినే ఇన్చార్జిగా పెట్టారా ? అనే సందేహం పెరిగిపోతోంది. నిజంగానే బండిని ఇన్చార్జిగా పెడితే మరి సోము పరిస్దితి ఏమిటి ? స్ధానిక నేతలు వీర్రాజు చెప్పింది వినాలా ? లేకపోతే బండి డైరెక్షన్నే ఫాలో అవ్వాలా ? కొద్ది రోజుల్లో క్లారిటి వచ్చేస్తుంది.