పిక్ టాక్: కూతురికి సీఐ సెల్యూట్ చేస్తే..

పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్లు ప్రయోజకులై, సమాజంలో మంచి పేరు సంపాదించినపుడు, ఒక స్థాయి అందుకున్నపుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అందులోనూ ఒక తండ్రి పని చేస్తున్న చోటే కూతురు ఉన్నతోద్యోగిగా చేరితే.. ఆమెకు ఆ తండ్రి సెల్యూట్ చేయాల్సి వస్తే అది అమితానందాన్ని, ఎంతో స్ఫూర్తిని ఇచ్చే విషయమే. తిరుపతిలో తాజాగా ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఇక్కడ సీఐగా పని చేస్తున్న శ్యామ్ సుందర్.. డీఎస్పీ అయిన తన కూతురికి సెల్యూట్ చేసే అరుదైన దృశ్యం అందరి మనసులను తాకింది.

2018 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన జెస్సీ ప్రశాంతి ప్రస్తుతం గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో భాగంగా ‘దిశ’ విభాగంలో బాధ్యతలు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చారు. కాగా తిరుపతి కళ్యాణి డ్యామ్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్యామ్ సుందర్ సైతం పోలీస్ డ్యూటీ మీట్‌కు హాజరయ్యారు. అక్కడ ప్రశాంతి ఉన్నతాధికారులతో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన శ్యామ్ సుందర్ కూతురిని చూసి ‘‘నమస్తే మేడమ్..’’ అంటూ సెల్యూట్ చేశారు. దీంతో ఆశ్చర్యపోయిన ప్రశాంతి.. ‘‘నాన్నా..’ అంటూ నవ్వేశారు. ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది.

ఈ అరుదైన దృశ్యం పోలీస్ డ్యూల్ మీట్‌కు హాజరైన ఉన్నతాధికారులను కూడా ఆకట్టుకుంది. చుట్టూ ఉన్న పోలీసులంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తూ చప్పట్లతో అభినందించారు. కూతురికి సెల్యూట్ చేయడంపై సీఐ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ… పిల్లలు ప్రయోజకులైతే తండ్రికి అంతకుమించిన సంతోషం ఏముంటుందని.. తన బిడ్డ నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి సన్నివేశాలు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటామన్నారు. తిరుపతి డ్యూటీ మీట్‌లో తండ్రీకూతుళ్లు ఇలా యూనిఫాం ధరించి విధుల్లో పాల్గొనడం వ్యక్తిగతంగా గర్వంగా ఉందన్నారు.