గ్రేట్ న్యూస్.. తమిళనాడు థియేటర్లలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీ

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మిగతా అన్ని రంగాలకూ దశల వారీగా ఊరటనిస్తూ థియేటర్ల విషయంలో మాత్రం బాగా ఆలస్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబరు 15కు గానీ థియేటర్లకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు కూడా 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇవ్వడంతో వాటిని నమ్ముకున్న వాళ్లకు నిరాశ తప్పలేదు. సగం కెపాసిటీతో థియేటర్లలో కొత్త చిత్రాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకు రాలేదు.

కొత్త సినిమాలు లేక పాతవి, అంతగా క్రేజ్ లేని కొత్త చిత్రాలను నామమాత్రంగానే నడిపిస్తున్నారు థియేటర్ల యజమానులు. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచిన రోజే సినీ రంగానికి పూర్వ వైభవం వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఐతే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం కేంద్రంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రంలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటిదాకా 50 శాతం కెపాసిటీతో నడుస్తున్న థియేటర్లలో ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. సంక్రాంతికి తమ చిత్రం ‘మాస్టర్’ను విడుదల చేస్తున్న నేపథ్యంలో థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీలో నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు ఏం హామీ లభించిందో ఏమో కానీ.. తర్వాతి రోజే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఖరారు చేశారు. 13న విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అది జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.

ఈ విషయంలో హామీ లభించాకే ‘మాస్టర్’ రిలీజ్ డేట్ ఖరారు చేశారని భావిస్తున్నారు. త్వరలోనే తమిళనాట ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో విజయ్‌ని, అతడి అభిమానులను మచ్చిక చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఏదేమైనా ‘మాస్టర్’ సినిమాకే కాక తమిళ సినీ పరిశ్రమకు ఇది బిగ్ బూస్ట్ అనడంలో సందేహం లేదు.