ప్ర‌మాదంలో ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌?


భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిందంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. ఈసారి సిరీస్ ఏ గొడ‌వా లేకుండా సాఫీగా సాగిపోతోంద‌నుకుంటే.. మూడో టెస్టు కోసం జ‌ట్టుతో క‌లిసి సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌.. పృథ్వీ షా, శుభ్‌మ‌న్ గిల్, రిష‌బ్ పంత్, న‌వ‌దీప్ సైని లాంటి కుర్రాళ్ల‌ను వెంటేసుకుని నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించి ఓ రెస్టారెంట్లో భోజ‌నం చేయ‌డం దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వెంట‌నే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఆ అయిదుగురిని జ‌ట్టుతో కాకుండా ఐసొలేష‌న్లో ఉండాల‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఉదంతంపై బీసీసీఐతో క‌లిసి విచార‌ణ జ‌రుపుతామ‌ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ నెల 7న సిడ్నీలో ఆరంభ‌మ‌య్యే మూడో టెస్టు వ‌ర‌కు రోహిత్ అండ్ కో జ‌ట్టుతో క‌ల‌వ‌ర‌న్న‌ట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ వ‌ర్గాలు తెలిపాయి.

కానీ ఈ విష‌యంలో బీసీసీఐ త‌న ప‌వ‌ర్ చూపించి.. ఒక్క రోజులో ప‌రిస్థితుల‌న్నీ మారిపోయేలా చేసింది. శ‌నివారం క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాల మేర‌కు జ‌ట్టు నుంచి విడిగా ఐసొలేష‌న్లో ఉన్న ఆట‌గాళ్లు.. 24 గంట‌లు గ‌డిచేస‌రికి మ‌ళ్లీ జ‌ట్టు ద‌గ్గ‌రికి వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మ ఆట‌గాళ్లు రెస్టారెంట్లో భోజ‌నం చేయ‌లేద‌ని, ఫుడ్ తెచ్చుకోవ‌డానికి మాత్ర‌మే అక్క‌డికెళ్లార‌ని బీసీసీఐ వాదిస్తోంద‌ట‌. కాబ‌ట్టి త‌మ వాళ్ల‌కు ఐసొలేష‌న్ అవ‌స‌రం లేద‌ని తేల్చేసిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం భార‌త జ‌ట్టు సిడ్నీకి బ‌య‌ల్దేర‌నుండ‌గా.. జ‌ట్టుతో పాటే రోహిత్ అండ్ కో ఉండ‌బోతోంద‌ట‌.

ఐతే నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించి భార‌త జ‌ట్టు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం, త‌మ మాట‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం క్రికెట్ ఆస్ట్రేలియాకు అస్స‌లు న‌చ్చ‌ట్లేదు. కానీ బీసీసీఐ ప‌వ‌ర్ చూసి ఏమీ చేయ‌లేక‌పోతోంది. మ‌రోవైపు నాలుగో టెస్టు జ‌ర‌గ‌నున్న బ్రిస్బేన్‌లో క‌రోనా, క్వారంటైన్‌ నిబంధ‌న‌లు అత్యంత క‌ఠిన‌త‌రంగా ఉండ‌టంతో.. ఆ మ్యాచ్ అక్క‌డ ఆడ‌మ‌ని, సిడ్నీలోనే నాలుగో టెస్టు కూడా నిర్వ‌హించాల‌ని భార‌త జ‌ట్టు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇందుకు అంగీక‌రించ‌ని ప‌క్షంలో సిరీస్‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని టీమ్ ఇండియా హెచ్చ‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో సిరీస్ ఎక్క‌డ ప్ర‌మాదంలో ప‌డుతుందో అని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.