దిల్ రాజు పట్టుకుంటే వదలడే..

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఎవరైనా యంగ్ హీరో మీద గురి కుదిరితే.. వరుసబెట్టి సినిమాలు చేయడం అలవాటు. ఒక సినిమాతో ఆపేయడు. ఆ హీరో ఇమేజ్ మారిపోయి తనకు అందుబాటులోకి రాకుంటేనో.. లేదంటే బాక్సాఫీస్ దగ్గర ఎదురు దెబ్బ తగిలితోనో తప్ప ఆ హీరోతో ప్రయాణం ఆపడు. అల్లు అర్జున్, సిద్దార్థ్, వరుణ్ సందేశ్, సాయిధరమ్ తేజ్, రాజ్ తరుణ్.. ఇలా యంగ్ హీరోలు చాలామందితో తన సంస్థలో ఒక సినిమా చేశాక మళ్లీ సినిమాలు లైన్లో పెట్టాడు.

ఇప్పుడు ఆయన గురి మరో యంగ్ హీరో మీద పడింది. అతనే.. విశ్వక్సేన్. ఈ యంగ్ హీరో నటించిన తొలి సినిమా ‘వెళ్ళిపోమాకె’ను దిల్ రాజే తన సంస్థలో రిలీజ్ చేయడం తెలిసిన సంగతే. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్, హిట్ లాంటి సినిమాలతో విశ్వక్సేన్ మంచి గుర్తింపే సంపాదించాడు. ఇందులో హిట్ సినిమాను నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు.

విశ్వక్సేన్ మీద పెట్టుబడి మంచి ఫలితాలే అందిస్తుందని అర్థం చేసుకున్న ఆయన.. అతను హీరోగా ప్రస్తుతం బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి ‘పాగల్’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే ఇప్పుడు అతను హీరోగా ఇంకో సినిమా కూడా మొదలుపెట్టాడు. తమిళంలో మంచి విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌కు విశ్వక్‌నే హీరోగా ఎంచుకున్నాడు. పొట్లూరి వరప్రసాద్‌తో కలిసి రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇలా యంగ్ హీరోల టాలెంట్ గుర్తించి వాళ్లు చిన్న స్థాయిలో ఉన్నపుడే కాంట్రాక్ట్ కుదుర్చుకుని వరుసగా సినిమాలు చేస్తాయి. దిల్ రాజు సైతం యంగ్ హీరోలపై ఇలాగే పెట్టుబడి పెడుతున్నాడు. ఇక ‘ఓ మై కడవులే’ రీమేక్ విషయానికొస్తే.. తమిళ వెర్షన్‌ను రూపొందించిన అశ్వత్ మారిముత్తునే తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు అందించనుండటం విశేషం.