‘బిగ్ బాస్’పై ఎన్నో అనుమానాలు

ఎన్నో సందేహాల మధ్య దక్షిణాదిన అడుగు పెట్టిన రెండు చోట్లా మంచి ఆదరణే సంపాదించుకుంటోంది ‘బిగ్ బాస్’ షో. కొందరు ఈ షో అంతా ట్రాష్ అని కొట్టి పారేసినా.. దీన్ని వీర లెవెల్లో ఫాలో అయ్యే వ్యూయర్స్ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ‘బిగ్ బాస్’ణు వ్యతిరేకించే వారి ప్రధాన అభ్యంతరం.. ఈ షో అంతా స్క్రిప్టెడ్ అనేదే. జనాలు అనుకున్నంత ఫెయిర్‌గా షో నడవదన్నది వారి మాట. పలు సందర్భాల్లో ప్రేక్షకుల అభిప్రాయాలకు భిన్నంగా ఎలిమినేషన్లు జరగడం ఇందుకు ఓ సూచిక. ఇక మొన్నటి గ్రాండ్ ఫినాలె విషయంలో జరిగిన ఉదంతాలు అనేక సందేహాలకు తావిచ్చాయి.

టైటిల్ రేసులో ఉంటావా.. మూడో స్థానంతో సంతృప్తి చెంది రూ.25 లక్షల డబ్బుతో నిష్క్రమిస్తావా అని సోహైల్‌ను అడిగితే.. అతను రేసు నుంచి తప్పుకుని డబ్బు తీసుకుని వెళ్లిపోవడానికే సిద్ధపడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటిదాకా వివిధ భాషల్లో ‘బిగ్ బాస్’ షోలో అలా ఎప్పుడూ జరిగింది లేదు. కానీ సోహైల్ మాత్రం ఈ రూటునే ఎంచుకున్నాడు. తాను విజేతగా నిలిచే అవకాశాలు లేవని హింట్ అందిన నేపథ్యంలోనే సోహైల్ ఇలా చేశాడనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఫినాలెకు ముందు హౌస్ నుంచి నిష్క్రమించిన కంటెస్టెంట్లందరూ టాప్-5ను కలిసే అవకాశం ఇచ్చినపుడు సోహైల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మెహబూబ్ అతడికి ఓటింగ్ ట్రెండ్స్ గురించి చెప్పినట్లుగా కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్’ ఫైనల్ అందరూ అనుకున్నట్లు పూర్తిగా లైవ్ కాదని.. దీన్ని రెండు రోజుల పాటు చిత్రీకరించారని ఒక ప్రచారం నడుస్తోంది. ఫైనల్ ఎపిసోడ్‌లో ఒక చోట సోహైల్ తొందరపాటులో.. ‘‘నిన్న నేను పది లక్షలు ఇచ్చినపుడు..’ అని వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అలాగే అతను పది లక్షలు అనాథాశ్రమానికి విరాళం ప్రకటించడం.. తర్వాత నాగ్ అతడి తరఫున పది లక్షలు తాను ఇస్తాననడం.. ఆపై చిరంజీవి తన వంతుగా రూ.10 లక్షలు ప్రకటించడం ఇదంతా స్క్రిప్టే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముందు చిరుకు ఈ విషయం ఏమీ తెలియనట్లుగా నాగ్ వివరించగా.. మధ్యలో చిరు ఒక చోట తనకీ విషయం ముందే తెలుసు అన్నట్లుగా ఒక మాట అనడం.. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తే స్క్రిప్టు ప్రకారమే అన్నీ జరిగాయనిపిస్తుంది.