బీజేపీని గెలిపిస్తే తిరుపతిని స్వర్ణమయం చేస్తారట

విచిత్రంగా ఉంది కమలనాదుల మాటలు. ఆలూ లేదు చూలు లేదు కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి. ఇంకా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు నోటీఫికేషనే రాలేదు. అప్పుడే ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తే తిరుపతిని స్వర్ణమయం చేసేస్తామంటూ హామీలు మాత్రం గుప్పించేస్తున్నారు. బీజేపీని ఉపఎన్నికలో గెలిపించినంత మాత్రాన తిరుపతిని ఏ విధంగా స్వర్ణమయం చేస్తారో మాత్రం చెప్పటం లేదు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇటువంటి ఆచరణ సాధ్యంకాని ప్రకటనలే చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఓల్డ్ సిటిలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన గుర్తుండే ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే ఓల్డ్ సిటిలో సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేయగలరు ? ఈ ప్రశ్నకు బండి దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెలంగాణా పోలీసులు బీజేపీ ఆధీనంలోకి వచ్చేస్తారా ? గ్రేటర్ మున్సిపాలిటి కూడా రాష్ట్రప్రభుత్వానికి లోబడే పనిచేయాల్సుంటుంది.

అంటే ఈ విషయం బండికి తెలీక కాదు ప్రకటన చేసింది. కావాలనే, జనాలను రెచ్చగొట్టడమ పనిగా పెట్టుకుని చేసిన ప్రకటనది. ఇపుడు తిరుపతిలో కూడా అధ్యక్షుడు సోమువీర్రాజు అలాంటి ప్రకటనే చేశారు. తిరుపతిలో బీజేపీ గెలిచినా ఏమీ చేయలేందన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలోనే తిరుపతిలో బహిరంగసభ జరిగింది. ఆ సభలో పాల్గొన్న నరేంద్రమోడి మాట్లాడుతూ ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేకహోదాతో పాటు ఇంకా చాలా చేస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమైంది ? ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి చేయలేదు.

ఈ విషయం తిరుపతి జనాలు మరచిపోయారని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. కానీ బీజేపీ ఎప్పుడైతే పోటీకి రెడీ అవుతోందో అప్పట్లో మోడి చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలన్నింటినీ జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఊపు చూస్తుంటే మొన్నటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధికి వచ్చిన 16500 ఓట్లకన్నా జరగబోయే ఉపఎన్నికలో మరికాస్త ఎక్కువ రావచ్చన్నదే మెజారిటి జనాల మాటగా వినిపిస్తోంది. మొత్తానికి గెలుపు, ఓటములను పక్కన పెట్టేస్తే బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయన్నది వాస్తవం. చూద్దాం ఉపఎన్నికలో ఏమేరకు పోటీ ఇస్తుందో.