చంద్రబాబు ఓటమికై పెద్దిరెడ్డి భీషణ ప్రతిజ్ఞ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భీషణ ప్రతిజ్ఞ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతు సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కుప్పంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. చంద్రబాబు, పెద్దిరెడ్డి ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వారే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉన్నాయి. వీళ్ళమధ్య వైరం రాజకీయంగానే కాకుండా ఓ రకంగా వ్యక్తిగతమనే చెప్పాలి.

వీళ్ళ వైరానికి దాదాపు 45 ఏళ్ళ చరిత్రుంది. ఇద్దరు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా విశ్వ విద్యాలయంలో చదివారు. యూనివర్సిటిలో చదివేటప్పుడే ఇద్దరు తమ సామాజికవర్గాల విద్యార్ధి సంఘాలకు నేతలుగా ఉండేవారు. అప్పటి నుండే ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండేది. అది పెరిగి పెరిగి చివరకు ఈ స్ధితికి చేరుకుంది. ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైరం పెరిగిపోయింది.

అయితే చంద్రబాబు ప్రయత్నాలను పెద్దిరెడ్డి ఎప్పటికప్పుడు తప్పించుకుంటునే ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటమే కాకుండా పెద్దిరెడ్డి మంత్రయ్యారు. అప్పటి నుండి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కుప్పంలో కూడా అమలయ్యేట్లు చర్యలు తీసుకుంటున్నారు.

కుప్పం నియోజకవర్గంలో రోడ్లు వేయించటం, ఇళ్ళ నిర్మాణాలు, ఇళ్ళ పట్టాలు పంపిణి, మంచినీటి సౌకర్యం కల్పించటం, రిజర్వాయర్లు ఏర్పాటు చేయటం లాంటి వాటిని పెద్దిరెడ్డి ప్రత్యేకంగా అమలు చేయిస్తున్నారు. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో ఫలితాల సమయంలో మొదటి రెండు రౌండ్లలో వైసీపీ అభ్యర్ధి చంద్రమౌళి కన్నా చంద్రబాబు వెనకబడ్డారు. ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు వెనకబడటం గడచిన 30 ఏళ్ళల్లో ఎప్పుడు జరగలేదు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ నేతల సమీక్షల్లో ఈ విషయమై చర్చించిన తర్వాత నియోజకవర్గంలో చంద్రబాబుపై వ్యతిరేకత ఉందన్న విషయం అర్ధమైంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే టార్గెట్ గా పెట్టుకుని పెద్దిరెడ్డి కుప్పంలో బాగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో సవాలు చేసి సంచలనం రేపారు. మరి పెద్దిరెడ్డి సవాలుకు చంద్రబాబు స్పందిస్తారా ? చూడాల్సిందే.