పాదయాత్రలతో వేడెక్కిపోనున్న తెలంగాణా

‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగ పాదయాత్ర చేయటానికి రెడీగా ఉన్నాను’ ..కోమటిరెడ్డి వెంకటరెడ్డి

‘రైతులు, జనాల సమస్యలు తెలుసుకునేందుకే తొందరలో పాదయాత్ర చేయబోతున్నాను’ జగ్గారెడ్డి

‘పీసీసీ ప్రెసిడెంట్ గా చేస్తే పాదయాత్ర చేస్తాను’.. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

ఇది పాదయాత్రకు సంబంధించిన లేటెస్టు హాట్ టాపిక్. విచిత్రమేమిటంటే పాదయాత్ర చేయటానికి రెడీ అవుతున్న ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్ వాళ్ళే. కోమటిరెడ్డి ఏమో మాజీమంత్రి భువనగిరి ఎంపి. జగ్గారెడ్డేమో సంగారెడ్డి ఎంఎల్ఏ. ఇక రేవంత్ ఏమో మల్కాజ్ గిరి ఎంపి+పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ముగ్గురులోను రెండు సారూప్యతులున్నాయి.

అవేమిటంటే ముగ్గురూ పీసీసీ అద్యక్షపీఠాన్ని కోరుకుంటున్నారు. పైగా ఒకరంటే మరొకరికి ఏమాత్రం పడదు. ఇదే సమయంలో ముగ్గురికీ కేసీయార్ కు బద్ధశతృవులే కావటం విచిత్రం. సరే కారణాలు ఏవైనా, మార్గాలు ఏవైనా, వాళ్ళమధ్య ఎంత పోటీ ఉన్నా ప్లాన్ చేస్తున్న పాదయాత్రతో పార్టీకి మంచి జరుగుతుందనే అనుకుంటున్నారు పార్టీలోని నేతలు. ఎనిమిదన్నరేళ్ళ టీడీపీ పాలనలో చిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసిన పాదయాత్రే ఊపిరిలూదిందన్న విషయం అందరికీ తెలిసిందే.

పాదయాత్రంటే ఏదో ఫ్యాషన్ కోసం చేసేది కాదు. కష్టాల్లో సమస్యలతో అల్లాడుతున్న జనాలను ప్రత్యక్షంగా కలవటమే. దారిపొడువునా ప్రజా సమస్యలను తెలుసుకుంటు, వాళ్ళతో సమస్యలపై చర్చిస్తు, పరిష్కారాలను అన్వేషించటమే పాదయాత్ర ఉద్దేశ్యం. బాధలో ఉన్న జనాలకు ఊరటనిస్తు తానున్నాననే భరోసాను ఇచ్చేవాళ్ళే జననేతలవుతారు.

అంటే పాదయాత్ర చేయాలంటే ముందు మానసికంగా చాలా దమ్ముండాలి. పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని గతంతో వైస్సార్, తర్వాత చంద్రబాబునాయుడుతో పాటు తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా నిరూపించారు. మధ్యలో వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేసినా అది సోదరుడు జగన్ కోసం చేసిన పాదయాత్ర మాత్రమే. అచ్చంగా తెలంగాణాలో మాత్రమే దివంగత ఎంఎల్ఏ ఇంద్రారెడ్డి కూడా పాదయాత్ర చేశారు.

ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపి తమ్మినేని వీరభద్రం కూడా పాదయాత్ర చేశారు. కాబట్టి తెలంగాణాకు పాదయాత్రలు కొత్తేమీకాదు. అందుకనే ఇపుడు కాంగ్రెస్ కీలక నేతలు చెబుతున్న పాదయాత్రపైనే అందరి దృష్టి నిలిచింది. మరెపుడు మొదలుపెడతారో ఎలా పూర్తి చేస్తారో చూడాల్సిందే.