ఒక్క కామెంట్‌తో గాలి తీసేసిన దర్శకుడు

ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఇటీవలే ఓ సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2021లో తమ సంస్థను రాబోతున్న అన్ని సినిమాలనూ థియేటర్లతో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోనూ ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థలో ప్రస్తుతం డ్యూన్, ది సుసైడ్ స్క్వాడ్, టామ్ అండ్ జెర్రీ, ది కంజూరింగ్: ది డెవిల్ మేక్ మి డు ఇట్, కింగ్ రిచర్డ్, జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయా లాంటి భారీ చిత్రాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

వీటిని కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తే ఆశించిన రెవెన్యూ రాదని అంచనా వేసిన వార్నర్ బ్రదర్స్… హెచ్‌బీవో మ్యాక్స్‌ ఓటీటీలోనూ ఒకేసారి వీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఐదే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

వార్నర్ బ్రదర్స్ సంస్థతో గొప్ప అనుబంధం ఉన్న లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్.. ఆ సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2021లో పరిస్థితుల మీద అప్పుడే ఓ అంచనాకు వచ్చేసి తమ సినిమాలన్నింటినీ ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదన్నట్లుగా నోలన్ మాట్లాడాడు. ఈ సంస్థతో అనేక మంది అగ్ర దర్శకులు, ఆర్టిస్టులు కలిసి పని చేస్తున్నారని.. తమ సినిమాలు పెద్ద తెరపై మాత్రమే ప్రేక్షకులు చూస్తారని వాళ్లు ఆశలు పెట్టుకున్నారని.. కానీ ఎవ్వరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వార్నర్ బ్రదర్స్ నిర్ణయం తీసుకోవడం తనను నిరాశ పరిచిందని నోలన్ అన్నాడు.

అంతటితో ఆగకుండా వార్నర్ బ్రదర్స్ ఒప్పందం చేసుకున్న హెచ్‌బీవో మ్యాక్స్ మీద అతను చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. అది వరస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అని అతను వ్యాఖ్యానించాడు. అలాంటి ఓటీటీలో వార్నర్ బ్రదర్స్ లాంటి పెద్ద సంస్థ తమ సినిమాలను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడం వివాదాస్పదమే అని అతనన్నాడు.