2020లో మూడో సినిమా రిలీజ్ చేస్తున్న హీరో

2020 సినీ పరిశ్రమకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇలాంటి నష్టాల్ని, విషాదాల్ని ఇంతకుముందు ఎన్నడూ చూడలేని ఈ ఇండస్ట్రీ. 8-9 నెలల పాటు థియేటర్లు మూతపడి ఉండటం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం. సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి చూశాక థియేటర్లు వెలవెలబోయాయి. తర్వాత థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం గురించి ఆలోచనే లేకపోయింది.

ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకున్నా సరే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎంతమాత్రం సుముఖంగా లేరు. ఐతే ఇలాంటి పరిస్థితుల్లోనూ 2020లో ఒక తెలుగు హీరో మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత అందుకోబోతుండటం విశేషం. ఈ మూడు సినిమాలూ కరోనా మొదలయ్యాకే ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటారా.. సత్యదేవ్.

కరోనా ధాటికి థియేటర్లు మూతపడి, ఓటీటీల జోరు మొదలైన సమయంలో ముందుగా ఆ ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ చేసిన తెలుగు హీరో సత్యదేవే. అతడి సినిమా ‘47 డేస్’ నాలుగు నెలల కిందటే విడుదలైంది. జీ5లో విడుదలైన ఆ సినిమాకు ఆశించిన స్పందన అయితే రాలేదు. కానీ ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన సత్యదేవ్ సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ మాత్రం మంచి ఫలితమే అందుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది.

సత్యదేవ్‌కు సోలో హీరోగా దీన్ని తొలి హిట్‌గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు సత్యదేవ్ 2020లోనే మరో సినిమాను వదిలేస్తున్నాడు. అతను హీరోగా, ప్రియదర్శి ఓ కీలక పాత్రలో నటించిన సినిమా ‘గువ్వా గోరింక’ ఈ నెల 17న అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజవుతోంది. మీడియం ఏదన్నది పక్కన పెడితే ఈ కరోనా టైంలో ఐదు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత సత్యదేవ్‌కే చెందుతుంది. ఈ ఏడాది మరే హీరో నుంచీ ఇన్ని సినిమాలు రాలేదు.