మాన‌సిక ప్ర‌క్షాళ‌నా?.. మంత్రుల ప్రక్షాళ‌నా?

అనూహ్య విజ‌యంతో రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అధికార టీఆర్ఎస్ పార్టీకి అంతే అనూహ్య‌మైన ప‌రాభ‌వం తాజా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎదురైంది. “తెలంగాణ కోసం.. తెలంగాణ బిడ్డ‌ల కోసం.. ఎంత‌కైనా సిద్ధ‌మే!” అన్న ఒక‌నాటి కేసీఆర్‌కు ఇప్ప‌టి కేసీఆర్‌కు మాట‌ల మ‌ధ్య వ్య‌త్యాసం లేక‌పోయినా.. చేత‌ల్లో స్ప‌ష్ట‌మైన వ్య‌త్యాసం కొట్టొ చ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌ను తోసిపుచ్చిన ఫ‌లితంగానే ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింద‌నేది వాస్త‌వం. వ‌రుస విజ‌యాల‌తో దూకుడుమీదున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత‌.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విజ‌యం సునాయాస‌మ‌ని అనుకున్నారు.

అయితే, బీజేపీ దూకుడుతో.. టీఆర్ఎస్ వేసుకున్న అంచ‌నాలు ఫ‌టాపంచ‌ల‌య్యాయి. అయితే.. ఇది నిజంగానే బీజేపీ దూకుడు అనాలా? లేక‌.. అధికార పార్టీ వైఫ‌ల్యాల‌నాలా? ఇప్పుడు ఈ విష‌య‌మే టీఆర్ఎస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ నుంచి కింది స్థాయి వ‌ర‌కు జ‌రుగు తున్న అంత‌ర్మ‌థ‌నంలో గ్రేట‌ర్ ప‌రాభ‌వ‌మే కీల‌క అంశంగా మారింది. ఈ క్ర‌మంలో రెండు అంశాలు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. ఒక‌టి పార్టీ అధినేతగా, కీల‌క నాయ‌కులుగా ఉన్న వారి మైండ్ సె ట్ మారాలా? లేక‌.. గుండుగుత్తుగా ఈ ప‌రాభ‌వాన్ని మంత్రుల‌పైనా, ఇత‌ర నేత‌ల‌పైనా నెట్టేసి త‌ప్పుకోవాలా? ఇదే కీల‌క అంశంగా అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది.

రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ అనుస‌రించిన విధానాలు.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ‌స్తున్న తీవ్ర అసంతృప్తి వంటివి ప్ర‌ధానంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాన్ని తారుమారు చేశాయ‌నేది వాస్త‌వం. నిజానికి బీజేపీ పుంజుకున్న‌ది అనేక‌న్నా.. టీఆర్ ఎస్‌పై ఉన్న వ్య‌తిరేక‌తే.. ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో క‌నిపించింద‌నేది వాస్త‌వం. బీజేపీ పుంజుకుని ఉంటే.. అతిర‌థ‌మ‌హార‌థులు వ‌చ్చి ప్ర‌చారం చేసిన త‌ర్వాత కూడా గ్రేట‌ర్‌లో ఏక‌ప‌క్షంగా బీజేపీ దూసుకుపోలేక పోయింది. అయితే.. పునాది గ‌ట్టి ప‌డింద‌ని ఆనందించ‌డ‌మే త‌ప్ప‌.. వాస్త‌వానికి అమిత్ షా, యోగి.. త‌దిత‌ర హేమాహేమీలు వ‌చ్చాక కూడా గ్రేట‌ర్ ప‌గ్గాలు చేప‌ట్ట‌లేదు.

అంటే.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై అసంతృప్తి(వ్య‌తిరేక‌త లేదు) ఉన్నా.. కేసీఆర్‌పై న‌మ్మ‌కం, విశ్వాసం ఉన్నాయ‌నేందుకు గ్రేట‌ర్ ఎన్నిక‌లే రుజువు. మ‌రి ఇప్పుడు కావాల్సింది ఏంటి? మ‌ంత్రుల‌పై భారం నెట్టేయ‌డ‌మో.. లేక‌.. కిందిస్థాయి నేత‌లు స‌రిగా ప‌నిచేయ‌లేద‌ని తీర్మానం చేయ‌డ‌మో కాదు.. ప్ర‌జ‌ల‌కోసం.. ప్ర‌జ‌ల చేత.. ఎన్నికైన ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల్లో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. వారి స‌మ‌స్య‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌జాద‌ర్బార్‌.. వంటి కీల‌క కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.