రాజు గారి కొత్త యాపారం


ఒకప్పుడు శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు. నిర్మాత ఆయన స్థాయి పడిపోతున్న సమయంలోనే దర్శకుడిగా మారి.. వాన, తూనీగ తూనీగ లాంటి సినిమాలు తీశారు. కానీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈలోపు నిర్మాతగా ఆయన పరిస్థితి తల్లికిందులైంది. అడ్రస్ లేకుండా పోయారు రాజు.

ఐతే చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ‘డర్టీ హరి’ అనే అడల్ట్ మూవీ తీశాడు. శ్రావణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. ఎప్పట్నుంచో రిలీజ్ గురించి కుర్రాళ్లను ఊరిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 18న విడుదల కాబోతోంది. ఐతే థియేటర్లు పున:ప్రారంభం అయిన నేపథ్యంలో వాటిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారా.. ఓటీటీ రిలీజ్‌కు వెళ్తారా అన్న సందేహం జనాల్లో ఉంది.

ఐతే రాజు గారు కొత్త రూటు ఎంచుకున్నారు. తన సినిమాను థియేటర్లలోనూ రిలీజ్ చేయట్లేదు. ఓటీటీ రిలీజ్‌కూ వెళ్లలేదు. పే పర్ వ్యూ పద్ధతిన ‘ఏటీటీ’లో రిలీజ్ చేయబోతున్నారు. వరల్డ్స్ ఫస్ట్ ఏటీటీగా వార్తల్లో నిలిచిన శ్రేయాస్ఈటీ సంస్థ.. కొత్తగా ఫ్రైడే మూవీస్ పేరుతో యాప్ తీసుకొస్తోంది. ఇకపై ఇందులోనే పే పవర్ వ్యూ పద్ధతిలో కొత్త సినిమాలు విడుదల చేయబోతోంది. అందులోనే ‘డర్టీ హరి’ విడుదల కాబోతోంది. ఇంకా టికెట్ రేటు ఎంత అన్నది నిర్ణయించలేదు.

ఎం.ఎస్.రాజు గత సినిమాల చరిత్ర చూసి ‘డర్టీ హరి’లో ఏదో స్పెషాలిటీ ఉంటుందని ఆశించిన వాళ్లకు ఆ సినిమా ప్రోమోలు షాకిచ్చాయి. బాలీవుడ్లో చూసే ఎరోటిక్ బి-గ్రేడ్ సినిమాల స్ఫూర్తితో పూర్తిగా బూతును నింపేసి ఆయన ఈ సినిమాను రూపొందించినట్లున్నారు. ఈ మధ్యే ఈ చిత్రం నుంచి హీరో హీరోయిన్లు రకరకాల మార్గాల్లో శృంగారం పండించే పాట ఒకటి విడుదల చేశారు. అది చూసి రాజు గారు ఎంత కిందికి దిగిపోయారో అనిపించింది ఆయన అభిమానులకు. మరి సినిమాలో ఇంతకుమించి ఆయనేం చూపిస్తారో చూడాలి.