కరోనా వ్యాక్సిన్ ధర రూ. 730 లోపే

ప్రపంచం అంత కరోనా వైరస్ కు విరుగుడు టీకామందు ఎప్పుడు రిలీజవుతుందా అని ఎదురు చూస్తోంది. ఎందుకంటే కరోనా మహమ్మారికి కొన్ని లక్షలమంది చనిపోయారు కాబట్టే. మందేలేని ఈ వైరస్ ప్రస్తుతం యావత్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. అందుకనే రష్యా, చైనా, బ్రిటన్, అమెరికా, భారత్ లాంటి దేశాల్లో యుద్ధ ప్రాతిపదికన టీకామందు తయారీకి శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే.

రష్యా, చైనా దేశాల్లో టీకామందు క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే కొందరిపై ప్రయోగించేశారు. దాంతో కొందరిపై ఆ మందు వికటించి పెద్ద గొడవలే అవుతున్నాయి. చెన్నైలో కూడా క్లినికల్ ట్రయల్ వికటించి ఓ వాలంటీర్ విషయంలో ఎంత గొడవవుతోందో అందరు చూస్తున్నదే.

ఇదే విషయమై తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్పష్టత వచ్చింది. క్లినికల్ ట్రయల్స్ తర్వాత నిపుణులు పచ్చజెండా ఊపితే మనదేశంలో కొన్ని వారాల్లోనే టీకామందును జనాలకు ఇవ్వడానికి రెడీ చేసేస్తామన్నారు. మొదటగా వైద్యులు, వృద్ధులకు టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు మోడి చెప్పారు. తర్వాత కరోనా వైరస్ పై పోరాటాలు చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే పోలీసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు, భద్రతా బలగాలకు టీకాను ఇవ్వనున్నట్లు చెప్పారు.

మిగిలిన దేశాల్లో టీకామందు ధర 10 డాలర్ల నుండి 35 డాలర్ల వరకు ఉండచ్చనే అంచనాలున్నాయి. అయితే మనదేశంలో మాత్రం 10 డాలర్లకన్నా తక్కువ ధరకే అందించటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మోడి చెప్పారు. 10 డాలర్లంటే ఇప్పటి ధర ప్రకారం సుమారు 730 రూపాయలే కావటం గమనార్హం. మరి టీకా అందుబాటులోకి వచ్చిన రోజుకు డాలర్ ధర ఎంతుంటుందో చూడాలి.

ఏదేమైనా ధర ఎంతైనా కొనుగోలు చేయటానికి దేశంలోని కొన్ని లక్షలమంది రెడీగా ఉన్నారు. ఇటువంటి నేపధ్యంలో టీకా ధర రూ. 730 అంటే పెద్ద ధరేమీ కాదని అందరికీ తెలిసిందే. పైగా బ్రిటన్లో టీకామందు అందుబాటులోకి రాబోతోందని తెలిసి మనదేశం నుండి ఇంగ్లాండ్ కు వెళ్ళి టీకా వేయించుకోవటానికి చాలామంది రెడీ అయిపోతున్నారు. ప్రపంచంలోని మానవాళి ప్రాణాలను కాపాడేందుకే అత్యంత తక్కువ ధరలకు టీకామందు అందుబాటులో ఉంచటం మంచిదే కదా.