హాలీవుడ్ మెగా బేనర్ సంచలన నిర్ణయం

మన దగ్గర ఇంకో నెల రోజుల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయన్న ఆశతో సంక్రాంతికి అడరజను దాకా సినిమాలు రిలీజ్ చేయడానికి కర్చీఫ్‌లు వేసుకుని కూర్చుని ఉన్నారు నిర్మాతలు. ఇందులో చాలా వరకు సినిమాలు ఎప్పుడో పూర్తయినవి. థియేటర్లు తెరుచుకున్నాకే సినిమాలను రిలీజ్ చేస్తామని వాటి నిర్మాతలు భీష్మించుకుని కూర్చున్నారు. ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తూనే వచ్చారు. కొత్త ఏడాదిలో పరిస్థితులంతా మారిపోతాయని.. ఓటీటీల హవాకు తెరపడుతుందని, థియేటర్లు మళ్లీ కళకళలాడుతాయని వాళ్లు ఆశిస్తున్నారు.

ఐతే కొత్త ఏడాదిలో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుందని.. వచ్చే ఏడాది కూడా థియేటర్లకు కష్టాలు తప్పవని సంకేతాలు అందుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

తమ సంస్థలో ఇప్పటికే పూర్తయిన, త్వరలో పూర్తి కానున్న సినిమాలన్నీ కలిపి 15 దాకా కొత్త ఏడాదిలో విడుదల కావల్సి ఉండగా.. వాటిని ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో ఒకేసారి విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించుకుంది. ఈ సంస్థలో డ్యూన్, ది సుసైడ్ స్క్వాడ్, టామ్ అండ్ జెర్రీ, ది కంజూరింగ్: ది డెవిల్ మేక్ మి డు ఇట్, కింగ్ రిచర్డ్, జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయా లాంటి భారీ చిత్రాలు ఈ సంస్థలో ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వీటిని కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తే ఆశించిన రెవెన్యూ రాదని అర్థం చేసుకుంది వార్నర్ బ్రదర్స్. ఇవన్నీ కూడా 2021లో విడుదల కావాల్సిన సినిమాలే.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. అన్ని చోట్లా పూర్తి స్థాయిలో థియేటర్లు నడవడానికి ఇంకో ఏడాది సమయం పట్టేలా ఉంది. ఈ ఏడాది ‘టెనెట్’ లాంటి భారీ చిత్రాన్ని ధైర్యం చేసి రిలీజ్ చేస్తే అంచనాల్లో సగం ఆదాయం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీతో వార్నర్ బ్రదర్స్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఒకేసారి అందుబాటులో ఉన్న థియేటర్లలో, అలాగే హెచ్‌బీవోలో వార్నర్ బ్రదర్స్ సినిమాలు రిలీజవుతాయి.