రానాకు గత ఏడాది అసలేమైంది?

దగ్గుబాటి రానా అనారోగ్యం గురించి గత ఏడాది ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. అతడి కిడ్నీలు పాడయ్యాయని, ప్రాణాపాయం ఎదుర్కొంటున్నాడని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. అప్పట్లో రానా ఒక్కసారిగా బక్క చిక్కి కనిపించడం కూడా అందరిలో ఆందోళన రేకెత్తించింది. ఐతే తర్వాత అతను కోలుకుని మామూలు మనిషి అయ్యాడు. ఐతే తాజాగా సమంత నిర్వహించే టాక్ షోలో రానా దీని గురించి ప్రస్తావించాడు.

తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే వైరల్ అయింది. సంబంధిత ఎపిసోడ్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. అందులో తన అనారోగ్యంపై రానా మరింత వివరంగా మాట్లాడాడు. గత ఏడాది అసలేం జరిగిందో వివరించాడు. ఆ విషయాలు అతడి మాటల్లోనే..

‘‘అరణ్య సినిమా షూటింగ్‌కు కొన్ని రోజుల ముందు కళ్లకు లేజర్ సర్జరీ చేయించుకోవాలనుకున్నా. అందుకోసం చిన్నప్పట్నుంచి తెలిసిన వైద్యుణ్ని కలిశాను. ఆయన బీపీ టెస్ట్ చేసి.. ‘నీ ఆరోగ్యం బాగానే ఉందా? నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా?’ అని అడిగారు. అలా ఏం లేదు, బాగానే ఉన్నా అని చెప్పా. ఐతే బీపీ ప్రాబ్లెంగా ఉందని, సర్జరీ ఒక రోజు తర్వాత చేద్దామన్నారు. మధ్యలో వేరే డాక్టర్‌ను కలవమన్నారు. ఆ వైద్యుడి దగ్గరికెళ్తే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అనేక టెస్టులు చేశారు. తర్వాత ఆ ఆసుపత్రి హెడ్ వచ్చి నా ఆరోగ్య సమస్య తీవ్రత చెప్పారు. వెంటనే నాన్నను తీసుకుని యుఎస్‌కు వెళ్లిపోయాను. అక్కడ మూడు రోజల పాటు వైద్యులు అనేక పరీక్షలు చేశారు. చిన్నప్పట్నుంచి నాకు బీపీ ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయని.. కిడ్నీలు పాడయ్యాయని.. వెంటనే చికిత్స తీసుకోకుంటే ప్రమాదమని చెప్పారు. తనకున్న ఆరోగ్య సమస్య వల్ల ఆరు నెలల నుంచి ఏడాదిలోపు గుండెపోటు రావచ్చని.. మెదడులో నరాలు చిట్లి పోవడానికి 70 శాతం, చనిపోవడానికి 30 శాతం ఆస్కారం ఉందని చెప్పారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని.. మాంసాహారం, ఉప్పు తినొద్దని సూచించారు. వాళ్ల సూచనలు పాటించి, చికిత్స తీసుకుని ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగొచ్చాను’’ అని రానా గుర్తు చేసుకున్నాడు.